
బాలికలు.. పల్లెల్లో ఎక్కువ.. పట్టణాల్లో తక్కువ
కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాలన్నింటా ఇదే స్థితి
తెలంగాణలో 1000 మంది బాలురకు 896 మంది బాలికలే
రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో 1000కి 906 మంది బాలికలు
ఆందోళనకరంగా మహిళల్లో తగ్గుతున్న ఫర్టిలిటీ శాతం
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్)– 2021 గణాంకాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: విద్య మనిషిలో వివేకాన్ని, చైతన్యాన్ని పెంచుతుందంటారు. కానీ, మనదేశంలో చదువుకున్నవాళ్లు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యతతోపాటు మూఢత్వం కూడా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో బాలురతో పోల్చితే బాలికల శాతం వేగంగా పడిపోవటమే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్)–2021 గణాంకాలు దేశంతోపాటు తెలంగాణలో బాలికల జనాభా, మొత్తం జననాల రేటు ప్రమాదకరంగా పడిపోతున్న వైనాన్ని బయటపెట్టాయి.
జననాల రేటులోనూ అథమమే..
జననాల రేటు కూడా తెలంగాణలో గణనీయంగా తగ్గిపోయింది. ఒక మహిళ తన గర్భస్థ సామర్థ్య కాలపు సాధారణ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) తెలంగాణలో 1.5కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత తక్కువగా 1.4కి పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇది జనాభా స్థిరీకరణకు కావాల్సిన కనీస స్థాయి (2.1) కంటే చాలా తక్కువ. దేశవ్యాప్తంగా 1986లో ఎఫ్టీఆర్ 4.2గా ఉండగా, 2021 నాటికి 2.0కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 నుంచి 2.2కి తగ్గింది.
పట్టణాల్లో తగ్గిన బాలికా జననాలు
దక్షిణ భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత ఉన్న కేరళలో మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో లింగ నిష్పత్తిలో తేడా గణనీయంగా పెరిగిందని ఎస్ఆర్ఎస్ సర్వేలో తేలింది. తెలంగాణలో జననాల రేటు ప్రమాదకరంగా 1.5 శాతానికి పడిపోయింది. అందులో బాలికల జననాలు మరింత తక్కువగా ఉన్నాయి. దేశంలో లింగనిష్పత్తి 913 (1,000 మంది పురుషులకు 913 మంది స్త్రీలు) ఉండగా, తెలంగాణలో అది 902కే పరిమితమైంది.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో లింగనిష్పత్తి మరింత తగ్గింది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో లింగ నిష్పత్తి 1,000కి 896 మాత్రమే ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యల్పం. ఈ గణాంకాలు రాష్ట్రంలో బాలికల పట్ల వివక్షకు నిదర్శనంగా నిలుస్తున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే శ్రామిక సామర్థ్యం, లింగ సమతుల్యతపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

త్వరలో వృద్ధ భారతం
ఈ గణాంకాల ప్రకారం చూస్తే త్వరలోనే తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుంది. ఉత్పాదకత తగ్గి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అధికం అవుతాయి. లింగ వివక్షతో పాటు తక్కువ ఫర్టిలిటీ రేటు ఉన్న రాష్ట్రాలు భవిష్యత్తులో పెళ్లిళ్లు ఆలస్యమవడం, ఉద్యోగ విభాగాల్లో యువ శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.