TG: జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత | TGSRTC Halts JBM Electric Bus Services Temporarily | Sakshi
Sakshi News home page

TG: జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

Jul 2 2026 8:41 PM | Updated on Jul 2 2026 9:53 PM

 TGSRTC Halts JBM Electric Bus Services Temporarily

హైదరాబాద్‌: నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నడుస్తున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులలో (JBM e-Buses) వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతను దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేతకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

గత నెల జూన్ 21వ తేదీ  ఉదయం 8 గంటలకు కరీంనగర్ సమీపంలో అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై పూర్తి నివేదిక రాకముందే మరొక ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం  ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్‌లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై స్పందించి నివేదిక సమర్పించాలని  తెలంగాణ ఆర్టీసీ జేబీఎం సంస్థను కోరింది. ఆర్టీసీ విజ్ఞాపనపై స్పందించిన జేబీఎం సంస్థ పైన పేర్కొన్న పలు అంశాలపై నివేదికను సిద్ధం చేస్తోంది.

భద్రతా ప్రమాణాలు, సంబంధిత నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సంస్థ నిర్దేశించిన అన్ని షరతులను జేబీఎం యాజమాన్యం పూర్తిగా పాటించినట్లు సంతృప్తి చెందితే వాహనాల పునరుద్ధరణపై తుది నిర్ణయం తీసుకుంటారు. 100% సేఫ్టీ సర్టిఫికేట్ వస్తేనే సర్వేసుల పునరుద్ధరణ ఉంటుంది. ప్రజా రవాణాలో భద్రత విషయంలో టీజీఎస్ఆర్టీసీ ఎటువంటి రాజీ పడదని, ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఈ సందర్భంగా యాజమాన్యం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement