రెండున్నరేళ్లలో 2 ఎయిర్‌పోర్టులు | Tenders for construction of Warangal and Adilabad airports end of this year | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లలో 2 ఎయిర్‌పోర్టులు

Jun 8 2025 4:56 AM | Updated on Jun 8 2025 4:56 AM

Tenders for construction of Warangal and Adilabad airports end of this year

వరంగల్, ఆదిలాబాద్‌ విమానాశ్రయాల నిర్మాణానికి ఈ ఏడాది చివరలో టెండర్లు 

2027 చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు 

భారీ విమానాలు వచ్చిపోయేలా 3 వేల మీటర్ల రన్‌వేలు 

500 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మాణం 

80 శాతం నిర్వహణ ఖర్చు భరించనున్న కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే రెండున్నరేళ్లలో తెలంగాణలో ఒకేసారి రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉండగా, 2027 చివరికల్లా మూడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండనున్నాయి. 

వరంగల్‌ శివారులోని మామునూరులో ఉన్న నిజాం కాలంనాటి ఎయిర్ర్‌స్టిప్‌, ఆదిలాబాద్‌ పట్టణ శివారు శాంతినగర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) ఆధ్వర్యంలో ఉన్న హెలిపోర్టుల స్థానంలో ఈ కొత్త విమానాశ్రయాలు నిర్మాణం కాబోతున్నాయి. 

ఈ సంవత్సరం చివరికల్లా టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చర్యలు ప్రారంభించింది. దాదాపు వేయి ఎకరాల విస్తీర్ణంలో వరంగల్‌ విమానాశ్రయాన్ని స్వయంగా ఏఏఐ నిర్మించనుండగా, ఆదిలాబాద్‌ విమానాశ్రయం విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

నైట్‌ ల్యాండింగ్‌.. బోయింగ్‌ 737కు సరిపడా రన్‌వే.. 
ఈ విమానాశ్రయాలను ఆధునిక ఎయిర్‌పోర్టులుగా నిర్మించనున్నారు. సాధారణంగా విమానాశ్రయాలు నిర్మించేటప్పుడు తొలుత చిన్న విమానాలు దిగేలా రూపొందించి, భవిష్యత్తులో వాటిని విస్తరిస్తారు. కానీ, వీటిని ఒకేసారి పెద్ద విమానాశ్రయాలుగానే నిర్మించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదనకు ఏఏఐ సమ్మతించింది. 

రాత్రివేళ కూడా విమానాలు వచ్చిపోయే వసతులుండాలని సీఎం కోరగా, దానికీ ఓకే చెప్పింది. బోయింగ్‌ 737, ఎయిర్‌బస్‌ 320 లాంటి పెద్ద విమానాలు కూడా వచ్చిపోయేందుకు వీలుగా దాదాపు 3 వేల మీటర్ల పొడవైన రన్‌వేలను నిర్మించనున్నారు. నైట్‌ల్యాండింగ్, టేకాఫ్‌కు వీలుగా ఆధునిక మెకానిజం ఏర్పాటు చేయనున్నారు.  

వరంగల్‌ ఎయిర్‌పోర్టు వేయి ఎకరాల్లో, ఆదిలాబాద్‌ విమానాశ్రయం 600 ఎకరాల విస్తీర్ణంలో రూపొందుతాయి. ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.  

ఒకేసారి 500 మంది ప్రయాణించేలా వీటిని నిర్మిస్తున్నారు. ఉడాన్‌ రీజినల్‌ కనెక్టివిటీ స్కీంతో వీటిని అనుసంధానిస్తారు. మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ను కేంద్రం అందిస్తుంది. విమానాశ్రయ నిర్వహణ వ్యయంలో కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం భరిస్తాయి.  

వరంగల్‌లో చకచకా భూ సేకరణ 
నిజాం కాలంలో మామునూరులో ఎయిర్ర్‌స్టిప్‌ నిర్మించారు. ఇక్కడ 1,400, 1,000 మీటర్ల వెడల్పుతో రెండు శిథిల రన్‌వేలున్నాయి. ఇప్పుడు వీటి స్థానంలో 3 వేల మీటర్ల భారీ రన్‌వే రూపొందనుంది. పాత ఎయిర్ర్‌స్టిప్‌నకు సంబంధించి ఏఏఐ అధీనంలో 696.14 ఎకరాల భూమి ఉంది. ప్రతిపాదిత భారీ విమానాశ్రయానికి మరో 280 ఎకరాల భూమి అవసరం. సమీపంలోని ఉన్న రెండు ఊళ్లను ఖాళీ చేయించి ఆ భూమిని సేకరించే కసరత్తు ప్రారంభించారు. 

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను ఇందుకోసం విడుదల చేసింది. ప్రస్తుతం అధికారులు ఆ రెండు గ్రామాల ప్రజలను ఒప్పించే పనిలో ఉన్నారు. సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిహారంగా నిర్వాసితులకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి రెండు ప్రణాళికలు రూపొందించారు. గ్రామస్తులు ఎంచుకున్న దానికి అమలు చేయనున్నారు. వరంగల్‌–ఖమ్మం, మరో రోడ్డును దారి మళ్లించనున్నారు.  

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్‌ఓసీ 
నిజాం హయాంలో ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని శాంతినగర్‌లో చిన్న ఎయిర్ర్‌స్టిప్‌ సేవలందించింది. ప్రస్తుతం అది ఐఏఎఫ్‌ అదీనంలో ఉంది. అక్కడ రన్‌వే బదులు హెలిప్యాడ్‌ మాత్రమే ఉంది. దీన్ని ప్రస్తుతం హెలిపోర్టుగా వినియోగిస్తున్నారు. దీన్ని భవిష్యత్తులో ఎయిర్‌ఫోర్స్‌ జెట్ల వినియోగానికి వీలుగా అభివృద్ధి చేయాలని చాలాకాలంగా ఐఏఎఫ్‌ ప్రయత్నిస్తోంది. తాజా నిర్ణయంలో ఆ కల సాకారం కానుంది. 

ఇందుకు సమ్మతిస్తూ తాజాగా ఐఏఎఫ్‌ ఎన్‌ఓసీ జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌ అదీనంలో 369 ఎకరాల భూమి ఉంది. మరో 250 ఎకరాలు సేకరించి విమానాశ్రయం నిర్మించనున్నారు. రెండు విమానాశ్రయాలను 24 నెలల్లో సిద్ధం చేయనున్నట్టు తాజాగా ఏఏఐ పేర్కొంది. అయితే, 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. దీంతో రెండేళ్లలోపు అవి సిద్ధమవటం ఖాయంగా కనిపిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement