సాధారణం కంటే ఎక్కువగానమోదవుతున్న ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్లో అత్యధికంగా41.3 డిగ్రీల సెల్సియస్ నమోదు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోవడగాడ్పులు వీస్తాయన్నవాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా జూన్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదు కావాల్సి ఉండగా ఎల్నినో వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యధికంగా ఆదిలాబాద్లో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 20 జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు వీస్తాయని వివరించింది. నాలుగు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని, రుతుపవనాల కదలికలు చురుకుగా ఉంటే వేగంగా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


