పోషకలోపం.. ఊబకాయం! | Telangana youth suffering from double burden of malnutrition | Sakshi
Sakshi News home page

పోషకలోపం.. ఊబకాయం!

Jun 4 2025 1:24 AM | Updated on Jun 4 2025 1:24 AM

Telangana youth suffering from double burden of malnutrition

డబుల్‌ బర్డెన్‌ ఆఫ్‌ మాల్‌న్యూట్రిషన్‌తో బాధపడుతున్న తెలంగాణ యువత

22 ఏళ్ల వయస్కుల్లో29% మందిలో పోషకాహార లోపం..19% మందిలో స్థూలకాయం

పురుషులతో పోలిస్తే మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం 

అధిక బరువుతో ఇబ్బందిపడుతున్న 18.8% మంది అతివలు 

ధనవంతుల ఇళ్లలో స్థూలకాయం... పేదల్లో పోషకాహార లోపం 

చదువుకోని/చదువుకున్న తల్లులు ఉన్న ఇళ్లలోనూ స్పష్టమైన తేడా 

యంగ్‌ లైవ్స్‌ సర్వే–2023లో కలవరపెట్టే గణాంకాలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 22 ఏళ్ల యువతలో ఒకవైపు స్థూలకాయం పెరుగుతుండగా మరోవైపు పోషకాహార లోపం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ‘డబుల్‌ బర్డెన్‌ ఆఫ్‌ మాల్‌న్యూట్రిషన్‌’గా పేర్కొంటున్నారు. తెలంగాణ యువత ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్లు ‘యంగ్‌ లైవ్స్‌’రౌండ్‌–7 సర్వే (2023–24) ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల యువతలో 19 శాతం మంది అధిక బరువు/ఒబేసిటీతో ఉండగా 29 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2016తో పోలిస్తే స్థూలకాయం రెండింతలైంది. 

అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా (18.8%) కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 14 శాతంగా ఉంది. మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రమాదాలకు దీన్ని కేంద్రంగా నిపుణులు గుర్తించారు. ఇప్పటికే 22.7% మహిళలు హై కార్డియోవ్యాసు్కలర్‌ రిస్‌్కలో ఉన్నారని హెచ్చరిస్తున్నారు. 

ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో 29 శాతంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. అందులో గ్రామీణ యువతలో తక్కువ బరువు ఉన్నవారి శాతం 30.9% కాగా.. పట్టణాల్లో ఇది 23.8% శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, తల్లులు తక్కువ చదువుకున్న కుటుంబాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.

మానసిక ఒత్తిడిలోయువత 
తెలంగాణలో వివిధ కారణాల వల్ల యువతలో 2023 నాటికి 71.3 శాతం మోస్తరు స్థాయి ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో వెల్లడైంది. పెద్దల్లో ఇది 68 శాతంగా ఉంది. వారిలో పురుషులు 66.7 శాతంగా ఉంటే మహిళలు 75.9 శాతంగా ఉన్నారు. ఇక 22.6% మందిలో మితమైన ఆందోళన, 17.47% మందిలో మితమైన డిప్రెషన్‌ లక్షణాలు బయటపడ్డాయి. 

మహిళలకంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్లు గణాంకాల ద్వారా తేలింది. పట్టణ యువతలో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్‌ తరువాత భావోద్రేకం లక్షణాలు 1.5 శాతం పెరిగినట్లు సర్వే తేల్చింది. కరోనా తర్వాత ఆరోగ్యంగా ఉండాలనే అభిలాష ప్రజల్లో పెరిగిందని.. గతంలో 23 శాతం మందే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోగా ఇప్పుడు వారి సంఖ్య 37 శాతానికి చేరినట్లు పేర్కొంది. 

అక్కడలా.. ఇక్కడిలా..
సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. సామాజికంగా దిగువస్థాయి వర్గాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండగా ఆరోగ్యంపై సరైన అవగాహన, వైద్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏటా ఎక్కువవుతోంది. 

అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంటుండగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అని తేలింది. 2016లో ధనవంతుల ఇంటి యువతలో స్థూలకాయం 30.6% ఉండగా.. పేదల్లో ఇది 14.0% మాత్రమే. అలాగే పేదల్లో తక్కువ బరువుతో 36.1 శాతం మంది ఉండగా ధనవంతుల్లో అది 21.5 శాతంగా ఉంది. 

విద్యా స్థాయిల తేడాల వల్ల కూడా.. 
తల్లుల విద్యాస్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, వారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నాయని సర్వే స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు తల్లికి పదేళ్లకుపైగా చదువు ఉంటే వారి పిల్లల్లో తక్కువ బరువు కలిగి ఉన్న వారు 24.1% ఉండగా స్థూలకాయం 27.6% వరకు ఉంది. విద్య, ఆర్థిక స్థితి, మహిళా సంక్షేమం ఇవన్నీ పోషకాహారం, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం పాఠశాల స్థాయిలో పోషకాహారం, ఆరోగ్య విద్య, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే పేద కుటుంబాలకు ప్రత్యేక ఆహార భద్రత కార్యక్రమాలు మరింత బలపరచాల్సిన అవసరం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement