
ఆన్లైన్ దరఖాస్తులపై విచారణ
దశల వారీగా మంజూరు షురూ
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డులకు మోక్షం లభించింది. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. అర్హులకు కొత్త కార్డులు మంజూరవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ ఇప్పటికే విచారణ పూర్తి చేసి కొందరికి కార్డులు మంజూరు చేయగా.. మరికొందరికి తిరస్కరించింది. ఇంకొన్ని దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీ వరకు మంజూరైన కొత్త కార్డులకు రేషన్ కోటా కేటాయించింది. దశలవారీగా విచారణ చేస్తూ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.
భారీగా దరఖాస్తులు..
గ్రేటర్ పరి«ధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కుటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పదేళ్లలో పెద్దగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్త కార్డుల కోసం తాకిడి పెరిగినట్లయింది.
పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన
కోడళ్లు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారంతా ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం సమగ్ర సర్వే ద్వారా గ్రేటర్లో మొత్తం 22 లక్షల కుటుంబాల వివరాలు సేకరించి, నమోదు చేసినట్లు అంచనా. మెజారిటీ దరఖాస్తుల్లో తమకు రేషన్కార్డు లేదని, కొత్త రేషన్ కార్డు కావాలని జనం కోరారు. అవన్నీ పరిశీలించిన తర్వాత అర్హుల లెక్క 83,285గా తేలింది. ఎన్నికల కోడ్ ఇతరత్రా కారణాలతో అది పెండింగ్లో పడిపోయింది. గత నెలలో ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహా్వనించడంతో పేద కుటుంబాలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై విచారణ నిర్వహిస్తూ కొత్త కార్డులు మంజూరు చేస్తోంది.