
సాక్షి, హైదరాబాద్: బాసరలో అరుదైన జైన శిల్పాన్ని గుర్తించారు. ఇది జైన మతంలో ప్రాధాన్యమున్న శాసనదేవత చక్రేశ్వరి విగ్రహం కావటం విశేషం. బాసరలో ఇంద్రతీర్ధంగా పిలుచుకునే కుక్కుటేశ్వరాలయంలో ఈ విగ్రహం ఉంది. సుఖాసనస్థితిలో ఉన్న ఈ చతుర్భుజి విగ్రహం వెనక హస్తాలలో శంఖం, అకుశం ఉండగా.. ముందు కుడి చేయి అభయహస్తంగా, ఎడమచేయి ఫలంతో ఉంది.
తలపై కిరీట మకుటం, తల వెనక ప్రభావళి, చెవి కుండలాలు, జైన తీర్థంకరులకు ఉండే త్రివళితాలు, మెడలో కంఠిక, హారం, కాళ్లకు కడియాలు, చేతులకు కంకణాలు ఉన్నాయని, ఇది 9 లేదా 10 శతాబ్దాలకు చెందిన రాష్ట్రకూట శైలి విగ్రహమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. తమ బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దీన్ని గుర్తించారని చెప్పారు.