ఇంజనీరింగ్‌లో మరిన్ని  కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు | Telangana: More Computer Science Seats In Engineering | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో మరిన్ని  కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు

Sep 15 2022 12:40 AM | Updated on Sep 15 2022 12:41 AM

Telangana: More Computer Science Seats In Engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ మలి విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా మరిన్ని కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ సీట్లు తగ్గిపో నున్నాయి. దీనిపై సాంకేతిక విద్య విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా పెరిగే సీట్లలో ఎక్కువభాగం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ వంటి విభాగాల సీట్లే ఉండనున్నాయి.

కొన్ని కాలేజీల్లో సైబర్‌ సెక్యూరిటీ సీట్లను పెంచనున్నారు. గత మూడేళ్లుగా డిమాండ్‌ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో డిమాండ్‌ ఉన్న కోర్సుల సీట్లను పెంచుకునేందు కు అఖిల భారత సాంకేతిక విద్యశాఖ అనుమతించడంతో.. రాష్ట్రంలో కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంజనీరింగ్‌ మలి విడత కౌన్సెలింగ్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ఆ సీట్లు సగానికన్నా తక్కువే..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,286 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సులకు పెద్దగా డిమాండ్‌ లేని పరిస్థితి ఉంది. మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్‌ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సివిల్‌ విభాగంలో 5 వేలు, మెకానికల్‌లో 4,615, ఈసీఈ 12,219, ఈఈఈ 5,778 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌లో ఉండబోతున్నాయి.

మొత్తం కలిపి ఈ సీట్ల సంఖ్య 27,612 మాత్రమే. పెరిగే 9,240 కంప్యూటర్‌ కోర్సుల సీట్లను కలిపితే.. రెండో విడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 80,526 సీట్లకు చేరనుంది. అంటే సంప్రదాయ కోర్సులు మూడో వంతుకు తగ్గిపోనున్నాయి. 52 వేలకుపైగా కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత కోర్సుల సీట్లే ఉండనున్నాయి. ఇప్పటికే సీఎస్సీ సీట్లు 18,686, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సీట్లు 7,737 వరకు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా 17 వేల సీట్లు ఖాళీ..
ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కేటాయించిన సీట్లలో 17 వేల మేర అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో 71,286 సీట్లు అందుబాటులో ఉంటే, 60,208 సీట్లను కేటా యించారు. ఇందులో 43 వేల మంది మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారని తెలిపాయి. మిగిలిన సీట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సీట్లే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement