సర్వం సిద్ధం.. | Dhansari Sitakka Comments On Special Arrangements For Telangana Kumbh Mela Medaram Jatara - Sakshi
Sakshi News home page

Medaram Jatara 2024: సర్వం సిద్ధం..

Feb 12 2024 4:35 AM | Updated on Feb 12 2024 4:28 PM

Telangana Kumbh Mela Medaram Jatara: Dhansari Sitakka - Sakshi

అమ్మవార్ల గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తులు

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం మహాజాతర కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు.

ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్‌ పనులు పూర్తయ్యాయని తెలిపారు.  ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ డాక్టర్‌ శబరీశ్, ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు.  

ఈనెల 14న మండమెలిగె పండుగ 
మహాజాతర ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. 14న బుధవారం సమ్మక్క– సారలమ్మ పూజారులు మండమెలిగె పండుగ  నిర్వహించనున్నారు. 

ఉత్సవ కమిటీ చైర్మన్‌గా లచ్చుపటేల్‌ 
సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా అరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ్‌సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం త్వరలో చేయనున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement