భోజనంలో పుల్లలు, దారాలు..

Telangana High Court Comments On Gandhi Hospital Food Contractor - Sakshi

అయినా గాంధీ ఆస్పత్రి ఫుడ్‌ కాంట్రాక్టర్‌ను కొనసాగించాలా?: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేస్తున్న భోజనంలో కర్రపుల్లలు, దారాలు వస్తున్నాయన్న ఆరోపణలున్నాయని.. అయినా ఆ ఫుడ్‌ కాంట్రాక్టర్‌ను ఎందుకు కొనసాగించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆహారంలో నాణ్యత పెంచాలని గాంధీ ఆసుపత్రి వైద్యుల కమిటీ ఫుడ్‌ కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చినా ఫలితం లేదని పేర్కొంది. ఫుడ్‌ కాంట్రాక్టర్‌గా తనను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ కె.సురేశ్‌బాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టి స్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది.

నోటీసులు ఇవ్వకుండానే సురేశ్‌బాబును తొలగించారని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘భోజనంలో నాణ్యత బాగా లేదని రోగులు చేసిన ఫిర్యాదులను చూశారా’అని దమ్మాలపాటిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే నోటీసులు ఇచ్చాక నాణ్యత పెంచారని, నాణ్యత పెంచడంపై వైద్యుల కమిటీ సంతృప్తి చెందిందని దమ్మాలపాటి తెలిపారు. కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది అనేందుకు ఆధారాలను చూపాలని ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top