
స్టే ఉత్తర్వులు ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ
తదుపరి విచారణ జూన్ 11కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 నియామకాలపై గత నెలలో ఇచ్చిన స్టేని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. స్టే ఎత్తివేసి నియామకాలకు అనుమతిస్తే ఇక ఆ తర్వాత విచారణ జరిపినా అర్థం లేదని అభిప్రాయపడింది. ఎంపికైన వారు, ఎంపిక కాని వారినీ దృష్టిలో పెట్టుకుని క్షుణ్ణంగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సమగ్ర విచారణ చేపట్టకుండా, వాదనలు పూర్తిగా వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. గ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు జూన్ 11కు వాయిదా వేసింది.
అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చు: న్యాయమూర్తి
2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. కోర్టు సమయం ముగిసినా రెండు గంటలకు పైగా విచారణ కొనసాగించారు.
తొలుత వాదనలు వినిపించేందుకు అరగంట సమయం కావాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి కోరగా, న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలా వాదనలు వినిపిస్తూ పోతే ఇక అంతు ఉండదన్నారు. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చని.. వాదనలు సంక్షిప్తంగా విన్పించాలని సూచించారు. రీకౌంటింగ్లో మార్కులు తగ్గాయని పిటిషనర్లు పేర్కొంటున్న పూజితారెడ్డి సమాధాన పత్రాలు సహా ఇతర వివరాలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని టీజీపీఎస్సీకి సూచించారు. నకిలీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరుపక్షాలను హెచ్చరించారు.
వాదనలు ఇలా..
రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెబుతున్న కమిషన్ వద్ద మెయిన్స్ పరీక్షలు ఎందరు రాశారో కచ్చిత్చమైన వివరాలు ఇప్పటికీ లేవు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత కూడా లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది? కొన్ని సెంటర్ల నుంచి 10 శాతం మంది ఎంపికయ్యారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం మీడియాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఆయా మీడియం పేపర్లను ఆ సబ్జెక్టుల్లో నిపుణులైన వారే దిద్దారా? వారి వివరాలు లేవు. మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు వచ్చిన వారు ఎందరున్నారు? ఇలాంటి వివరాలు కమిషన్ ఎక్కడా పేర్కొనలేదు..’అని చెప్పారు.
టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. ‘కొందరు తప్పుడు డాక్యుమెంట్లతో పిటిషన్లు వేస్తున్నారు. ఇలా వేసిన కొందరు పిటిషనర్లకు ఇదే హైకోర్టులోని మరో బెంచ్ జరిమానా కూడా విధించింది. ఓ పిటిషనర్కు 60 మార్కులు తగ్గాయని పిటిషనర్ న్యాయవాది చెబుతున్నారు. అది తప్పుడు డాక్యుమెంటు. కొందరు పిటిషనర్లు వకాలత్పై సంతకమే పెట్టలేదు. తప్పుడు సంతకాలతో పిటిషన్లు వేస్తున్నారు. నియామకాలపై ఇచ్చిన స్టేని ఎత్తివేయాలి..’అని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.
‘నాపై విచారణను ఉపసంహరించండి’
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో తప్పుడు మార్కుల మెమో పెట్టిన వ్యవహారంలో తనపై విచారణ ఉపసంహరించాలని సంగారెడ్డి జిల్లా లింగంపల్లి పంచాయతీ సెక్రటరీ షబ్నం ఆర్యా(అభ్యర్థి) హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రిజి్రస్టార్ జనరల్కు లేఖ రాశారు. మెయిన్స్ పారదర్శకంగా జరగలేదని పేర్కొంటూ ఓ వాట్సాప్ గ్రూప్ రూపొందించి, తనను కూడా అందులో చేర్చారన్నారు. టీజీపీఎస్సీపై పోరాడటం కోసమంటూ రూ.5 వేలు అడిగితే పంపానన్నారు. ఆ తర్వాత ఇటీవల డబ్ల్యూపీ 12431/2025 పిటిషన్ ఉత్తర్వుల కాపీని గ్రూప్లో పోస్టు చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ల జాబితాలో తన పేరు ఉండటం చూసి ఆశ్చర్యపోయానన్నారు. తాను కేసు వేయలేదని, ఎలాంటి వకాలత్పై సంతకం పెట్టలేదని, తన పేరు తొలగించాలన్నారు.