ఎనిమిదేళ్లలో ఎంతో సాధించాం  | Telangana Grew Tremendously Over The Last Eight Years: Minister KTR | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్లలో ఎంతో సాధించాం 

Jun 3 2022 2:49 AM | Updated on Jun 3 2022 7:00 PM

Telangana Grew Tremendously Over The Last Eight Years: Minister KTR - Sakshi

సిరిసిల్లలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

సిరిసిల్ల: దేశంలో 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తెలంగాణ గత ఎనిమిదేళ్లలోనే సాధించిందని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు పేర్కొన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అస్తిత్వం కోసం 60ఏళ్లు పోరాడిన తెలంగాణ నేల.. ఇప్పుడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు.

ఎనిమిదేళ్ల స్పల్ప కాలంలోనే ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం కల్పన, ప్రజాసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కఠినమైన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకుంటూ 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

కేసీఆర్‌ నాయకత్వంలో జలవిప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవాలతో దేశానికి ఆదర్శంగా నిలిచామని కేటీఆర్‌ చెప్పారు. పల్లె ప్రగతికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement