పర్యవేక్షణ కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్ల వినియోగం
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామం పరిసరాల్లో పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. బుధవారం పులి కనిపించిన ప్రాంతానికి వాయవ్య దిశగా 2 కి.మీ దూరంలో తాజాగా పాదముద్రలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్ చర్యలను మరింత ముమ్మరం చేసినట్టు చెప్పారు.
ప్రస్తుతం ఉత్పన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్యవేక్షణ కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. పుణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం, స్థానిక అటవీ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తోంది. ఈ పరిసర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను పెంచడంతో పాటు, ప్రజలు జాగ్రత్త పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షిత మార్గం కల్పించేందుకు అటవీ శాఖ సమగ్ర చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


