దేశంలో తెలంగాణ రైతుల స్థానం.. అప్పుల్లో 5.. ఆదాయంలో 25 | Telangana Farmers Rank In Income And Debt In Country | Sakshi
Sakshi News home page

దేశంలో తెలంగాణ రైతుల స్థానం.. అప్పుల్లో 5.. ఆదాయంలో 25

Dec 27 2022 12:59 AM | Updated on Dec 27 2022 2:43 PM

Telangana Farmers Rank In Income And Debt In Country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన రైతన్నలు ఆ­దా­యంలో బాగా వెనుకంజలో ఉన్నారు. అప్పుల భారం కూడా భారీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నెలకు సగటున రూ.10,218 ఆదాయం మాత్రమే పొందుతున్నాడు. అంటే రోజుకు రూ.340 మా­త్ర­మే. అదే సమయంలో ఒక్కో రైతుకు స­గటు­న రూ.74,121 అప్పు ఉంది. ఇక రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో, ఆదాయంలో 25వ స్థానంలో ఉండటం గమనార్హం.

2018 జూలై నుంచి 2019 జూన్‌ వరకు దేశంలోని వ్యవసాయ కుటుంబాలు, రైతుల అప్పు, ఆదాయంపై సర్వే జరిగింది. సర్వే వివరాలు ఇటీవల పార్లమెంటులో చర్చకు రాగా.. అందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. రైతు కోసం ఎన్ని పథకాలు తీసు­కొస్తున్నా రైతు పరిస్థితి పూర్తిస్థాయిలో బాగు­ప­డటం లేదు. స్వామినాథన్‌ సిఫారసు­ల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు ల­భిం­చ­కపోవడమే ఇందుకు కారణమని నిపు­ణులు చెబుతున్నారు.

రోజుకు రూ.313 మాత్రమే
కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో నిలిచారు. తెలంగాణ రైతుల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. రైతు కుటుంబసభ్యుల సగటు ఆదాయం నెలకు రూ.9,403గా ఉంది. ఏడాదికి రూ.1,12,836. అంటే రోజుకు రూ.313 మాత్రమేనన్న మాట. ఇది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సగటు జీతం కంటే దాదాపు సగం తక్కువ. ఇక ఆదాయంలో తెలంగాణ రైతు దేశంలో 25వ స్థానంలో ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మేఘాలయ రైతు సగటున నెలకు రూ. 29,348 ఆదాయం పొందుతున్నాడు. పంజాబ్‌ రైతు రూ. 26,701, హరియాణ రైతు రూ.22,841, అరుణాచల్‌ప్రదేశ్‌ రైతు రూ. 19,225 పొందుతున్నాడని కేంద్రం తెలిపింది. 

రైతన్న ధనికుడు కాదని తేలిపోయింది 
ధనిక రాష్ట్రమని చెబుతున్న తెలంగాణలో రైతన్న ధనికుడు కాదని స్పష్టమైపోయింది. రూ.2.75 లక్షల తలసరి ఆదాయం ఉందని చెబుతున్నా, అది రైతుకు లేదని తేలిపోయింది. దిగుబడి పెరిగింది.. పంటలు బాగా పండిస్తున్నామని చెబుతు­న్నా, రైతుకు మార్కెట్లో అన్యాయం జరుగుతోంది. రైతుబంధు కౌలు రైతులకు అందడం లేదు. రుణమాఫీ కొందరికే చేశారు.

దీంతో అప్పులు పెరిగాయి. రైతులు ఆ రుణం నుంచి బయ­టపడటం లేదు. కౌలు రైతులకు రైతుబంధు, రుణమాఫీ అమ­లు కాకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంది. కౌలు రైతులు ఈ రాష్ట్రపు వారు కాదా? వారి బాగోగులు ప్రభుత్వానికి పట్టవా? 
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement