సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(అందె ఎల్లయ్య) అంత్యక్రియలు మరికాసేపట్లో ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో జరగనున్నాయి. పోలీస్ లాంఛనాలతో జరగనున్న ఈ అంత్యక్రియల్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్నారు. అంతకుముందు.. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సీనియర్ నేత వీహెచ్లు అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా.. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది.
సహజకవిగా పేరుగాంచిన అందెశ్రీ(64) సోమవారం ఉదయం ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణ..తో పాటు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని రగల్చిన అనేక పాటలను రాశారాయన. సాహితీ లోకానికి గర్వకారణమైన అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.


