సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును కొట్టేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో కోవిడ్–19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్రెడ్డిపై 2021లో కమలాపూర్ పోలీసులు నమోదు చేశారు. నాడు ఎంపీ, పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డికి కమలాపూర్లో ఎన్నికల ప్రచారానికి వెయ్యి మందితో సభకు పోలీసులు అనుమతి ఇవ్వగా, కోవిడ్–19 నిబంధనలను పాటించకుండా రెండువేల మందితో సభ నిర్వహించారని పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది.
రేవంత్రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్ అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించారని, ఆయనను ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది.


