దేశంలో రాజకీయ శూన్యతను పూరించాలి.. సీఎం కేసీఆర్‌–పీకే భేటీలో నిర్ణయం | Telangana CM KCR Meets Prashant Kishor | Sakshi
Sakshi News home page

సత్తా చాటే సమయమిదే..!

Jun 13 2022 3:30 AM | Updated on Jun 13 2022 3:30 AM

Telangana CM KCR Meets Prashant Kishor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృత నిశ్చయంతో ఉన్నారని.. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని త్వరలోనే ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఈ నెల 10న జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా.. జాతీయ స్థాయిలో రాజకీయ అరంగేట్రంపై సరైన సమయంలో, సరైన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్‌.. జాతీయ పార్టీ ప్రకటన, రాష్ట్రపతిఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలు– ప్రభుత్వ పనితీరుపై పీకే బృందం చేసిన సర్వే నివేదికలపై చర్చించారు. ప్రగతిభవన్‌లో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కేసీఆర్, పీకేతోపాటు మంత్రి హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. 

జాతీయ పార్టీ కావాలంటే ఎలా..? 
‘‘కేంద్రంలో బీజేపీ పాలనలో అశాంతి పెరిగిపోయింది. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయి. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైన నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా అవతరించడమే మార్గం..’’అని సీఎం కేసీఆర్, పీకే భేటీలో అభిప్రాయానికి వచి్చనట్టు తెలిసింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ను జాతీయ పారీ్టగా మార్చడంపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలపైనా చర్చించినట్టు సమాచారం.

రాష్ట్రాల వారీగా అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న పారీ్టలు, ఆయాచోట్ల కొత్త జాతీయ పారీ్టకి ఉన్న అనుకూలతలపై చర్చించినట్టు తెలిసింది. దేశంలో ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ పశి్చమబెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనతో ఉంది. ఢిల్లీలో ఆవిర్భవించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకొని దేశం వైపు చూస్తోంది. శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. 

‘దీదీ’సమావేశానికి వెళ్లాలని నిర్ణయం! 
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థని నిలబెట్టి బీజేపీకి షాకివ్వాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశి్చమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సహా 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి 15న ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని కోరారు.

ఈ నేపథ్యంలోనే గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్‌ కిషోర్‌తో ప్రస్తుత పరిణామాలపై సీఎం కేసీఆర్‌ చర్చించినట్టు సమాచారం. 15న జరిగే సమావేశానికి వెళ్లాడమా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం. కేసీఆర్‌ వెళ్లలేని పక్షంలో కేటీఆర్‌నుగానీ, పార్టీ తరఫున మరో ప్రతినిధినిగానీ ఢిల్లీకి పంపాలని నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని భావనకు వచి్చనట్టు సమాచారం. 

రాష్ట్రంలో ఎన్నికలు, సర్వేలపైనా చర్చ? 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ప్రశాంత్‌కిషోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ బృందం ఇటీవల సర్వే చేసి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో పీకే భేటీ అయి చర్చించారు కూడా. ఈ నేపథ్యంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై వారు మరోసారి చర్చించినట్టు తెలిసింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆప్షన్లు ఎలా ఉండాలనే దానిపైనా మంతనాలు సాగించినట్టు సమాచారం. 

కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ  – జాతీయ రాజకీయాలపైనే చర్చ 
సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ప్రవేశంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో.. ఏపీకి చెందిన ఉండవల్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకపాత్ర పోషించే అంశం, కొత్త పార్టీ ఏర్పాటు, టీఆర్‌ఎస్‌ను జాతీయ పారీ్టగా మార్చడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులపై చర్చించినట్టు తెలిసింది. ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ ముగిశాక సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భేటీ జరిగింది. ఇందులో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement