బీసీ రిజర్వేషన్లకు 5న కేబినెట్, అసెంబ్లీ ఆమోదం! | Telangana assembly session on Feb 5: set to approve caste census and SC sub categorisation | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లకు 5న కేబినెట్, అసెంబ్లీ ఆమోదం!

Feb 2 2025 4:02 AM | Updated on Feb 2 2025 4:02 AM

Telangana assembly session on Feb 5: set to approve caste census and SC sub categorisation

జనగణన నివేదికపై నేడు, రేపు మంత్రివర్గ ఉపసంఘం చర్చ  

మార్పులు, చేర్పులతో సీఎంకు నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశాన్ని ఈ నెల 5న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో తేల్చనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 5న మంత్రివర్గం భేటీ అవుతోంది. ఆ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించి, బీసీ రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేస్తారని తెలిసింది. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఆ నివేదికపై సభలో చర్చించను న్నారు. అదే రోజు నివేదికను సభ ఆమోదించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

కాగా ఆదివారం  ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా కులగణన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కు సచివాలయంలో అందించనున్నట్లు తెలిసింది. ఉత్తమ్‌ నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ,  శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్కలతో కులగణనపై గత ఏడాది అక్టోబర్‌ 19న మంత్రివర్గ ఉపసంఘం వేసిన విషయం తెలిసిందే.

ఈ ఉపసంఘం ఆది, సోమవారాల్లో సమావేశమై నివేదికపై చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేయనుంది. ఆ తర్వాత తుది నివేదికను సీఎం కు సమర్పించనుంది. ఉపసంఘం సూచనల మేరకు రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి ఈ నివేదికను రూపొందించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement