‘ఇంద్రేశం’లో 25 మంది విద్యార్థినులకు కరోనా

Telangana: 25 Students Of Residential School Test Positive - Sakshi

ముత్తంగి గురుకులంలో మరో ఆరుగురికి పాజిటివ్‌  

జూలూరుపాడు కేజీబీవీలో ముగ్గురు విద్యార్థినులకు..

పటాన్‌చెరుటౌన్‌/జూలూరుపాడు: విద్యాలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వేర్వేరు గురుకులాలు, కేజీబీవీల్లో గురువారం 34 మంది విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. ఒక్క సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలోని మహత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విద్యాసంస్థలో బుధవారం ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. గురువారం 966 విద్యార్థినులకు గాను అనుమానం ఉన్న 300 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌గా తేలింది.

దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 28కి చేరింది. కోవిడ్‌ సోకిన బాలికలను ప్రత్యేక ఐసోలేషన్‌ గదిలో ఉంచారు. ఇదే జిల్లా ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల విద్యాలయంలో గురువారం మరో ఆరుగురు విద్యార్థినులు కరోనా బారిపడ్డారు. ఇటీవల ఈ విద్యాసంస్థలో 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకిన విషయం తెలిసిందే.

గురువారం అనుమానం ఉన్న మరో 40 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. స్కూల్‌లో మిగిలిన మొత్తం 426 మంది విద్యార్థులు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు.  

జూలూరుపాడులో ముగ్గురు విద్యార్థినులకు.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం/కళాశాలలో ముగ్గురు విద్యార్థినులకు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఆరుగురు రెండ్రోజులుగా జలుబు, దగ్గుతో గత బాధపడుతుండగా స్థానిక పీహెచ్‌సీలో వీరిద్దరికీ పరీక్ష చేయించగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం కేజీబీవీలోని మొత్తం విద్యార్థినులకు పరీక్షలు చేయించగా, మరొకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top