Telangana: 108 Ambulance Services Handover To GVK Again - Sakshi
Sakshi News home page

మళ్లీ జీవీకే చేతికి ‘108’.. మండలానికో అంబులెన్సు..

Mar 20 2023 9:11 AM | Updated on Mar 20 2023 5:13 PM

Telangana 108 Services Handover To GVK Again - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’వాహన టెండర్‌ను మళ్లీ జీవీకే సంస్థే దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో జీవీకేతోపాటు మరో కంపెనీ పాల్గొంది. చివరకు జీవీకే సంస్థకే టెండర్‌ దక్కినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఈసారి 102 అమ్మ ఒడి, 104, ప్రభుత్వ ఆసుపత్రులనుంచి పేదల శవాలను వారి సొంతూళ్లకు ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాల బాధ్యత కూడా జీవీకేకే అప్పగించారు. ప్రస్తు తం 50 వాహనాలు పేదల శవాలను ఆసుపత్రుల నుంచి సొంతూళ్లకు ఉచితంగా తీసుకెళ్తున్నాయి. ఈ నాలుగు సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. 

ప్రస్తుతం 358 వాహనాలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘108’అత్యవసర అంబులెన్స్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అకస్మాత్తుగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా ఈ అంబులెన్స్‌ సేవలను ఉచితంగా పొందుతున్నారు. ప్రస్తుతం 358 వాహనాలు ‘108’అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలిన వాటిని రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా ఇచ్చారు.

ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అధికారులు చెపుతున్నారు. ఫోన్‌ చేసిన దాదా పు 20 నిమిషాల్లో అంబులెన్స్‌ బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన. ఈ అంబులెన్స్‌ సరీ్వసులను ప్రస్తుతం కూడా జీవీకే సంస్థనే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 108 వాహనాల నిర్వహణకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈసారి ఎంతకు ఖరారు చేశారన్న దానిపై స్పష్టత లేదు.  

పలు మార్పులకు శ్రీకారం..
ప్రస్తుతమున్న ‘108’అంబులెన్స్‌ సేవల్లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు జీవీకే సంస్థ ఏర్పాట్లు చేసే అవకాశముంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ కాల్‌ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్‌ ఆధారంగా అంబులెన్సులను ఆటోమాటిక్‌గా నడిపిస్తారు. ఆటోమాటిక్‌ కాల్‌ డి్రస్టిబ్యూటర్‌ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్‌ టెలిఫోనీ ఇంటర్‌ఫేస్‌ (సీటీఐ), వాయిస్‌ లాగింగ్‌ కేపబిలిటీస్, జీపీఎస్‌ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్‌ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు.

ఈ వ్యవస్థ ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్‌ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాక దీనిని విపత్తు నిర్వహణ విభాగానికి అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్‌ సరీ్వసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

మండలానికో ’108’వాహనం..
ఇకపై ప్రతీ మండలానికి ఒక ‘108’ వాహనాన్ని సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుకలుగుతుందని, అనేకమందిని ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చనేది ప్రభు త్వ ఆలోచన. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి కేటాయించడం ద్వారా ప్రతీ 70 వేల జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.
చదవండి: ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్‌ ట్రాకింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement