
విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి ఆధారంగా బదిలీలు
తాత్కాలిక ప్రాతిపదికన అదనపు టీచర్ల డిప్యుటేషన్
జిల్లా పరిధిలోని పాఠశాలలకు మాత్రమే పరిమితం
జూన్ 13 నుంచి కొత్త పాఠశాలలో టీచర్ల విధులు
వేతనాలు మాత్రం వాస్తవ పోస్టింగ్ ఉన్నచోటనే..
ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి తక్కువ టీచర్లు ఉన్న సమీప పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు అవకాశం కల్పించింది. తాత్కాలిక బదిలీలు/ డిప్యుటేషన్ పద్ధతిలో సర్దుబాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయటంతో ప్రస్తుతం చాలా పాఠశాలల్లో సంతృప్తికర స్థాయిలో టీచర్ల సంఖ్య ఉంది. అయితే, కొన్నిచోట్ల విద్యార్థుల నిష్పత్తి కంటే ఎక్కువ మంది టీచర్లుండగా, మరికొన్ని చోట్ల సరిపడా లేరు. దీంతో ఆ స్కూళ్లలో అవసరాన్ని బట్టి విద్యావలంటీర్లను నియమిస్తూ వస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో విద్యావలంటీర్ల అవసరాన్ని తగ్గించి అందుబాటులో ఉన్న టీచర్ల సేవలు వినియోగించుకునేందుకు సర్దుబాటు అవకాశం కల్పించారు. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
గిరిజన ప్రాంతాల నుంచి బదిలీలు వద్దు
విద్యార్థులు–ఉపాధ్యాయుల నిష్పత్తి విధానంపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చిది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఒక పాఠశాలలో పదిలోపు విద్యార్థులుంటే ఒక టీచర్, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61–90 మంది పిల్లలున్నచోట్ల ముగ్గురు, 91–120 మధ్య ఉంటే నలుగురు, 121–150 మంది ఉంటే ఐదుగురు, 151–200 మధ్య విద్యార్థులుంటే ఆరుగురు టీచర్లు ఉండాలి. ఈ దిశగా కసరత్తు చేయాలని విద్యాశాఖ సూచించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్లను మైదాన ప్రాంతాలకు పంపొద్దని, అదే సమయంలో ఏజెన్సీల్లో తగినంత మంది టీచర్లు లేకపోతే మైదాన ప్రాంతాల నుంచి డిప్యుటేషన్పై పంపాలని కోరింది.
విద్యార్థుల నిష్పత్తి కంటే ఎక్కువ మంది టీచర్లు ఉన్నచోట జూనియర్ టీచర్ను సర్ప్లస్ కేటగిరీలోకి చేర్చి అవసరమున్న సమీప పాఠశాలకు పంపించాలి. నిబంధనలకు అతీతంగా చేసే సర్దుబాట్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. డిప్యుటేషన్పై కొత్తగా సర్దుబాటు చేసిన పాఠశాలలో జూన్ 13వ తేదీ నుంచి టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ డిప్యుటేషన్ విధులు నిర్వహించడానికే పరిమితమని, వాస్తవ పోస్టింగ్ ఉన్నచోటి నుంచే వేతనం పొందాల్సి ఉంటుందని వెల్లడించింది. సర్దుబాటు చేసిన టీచర్ల జాబితాను జూన్ 30వ తేదీ కల్లా జిల్లా కలెక్టర్లు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమరి్పంచాలన్నారు.
ఐదు స్థాయిల్లో సర్దుబాట్లు
టీచర్ల సర్దుబాటులో ఐదు స్థాయిలను పాఠశాల విద్యాశాఖ నిర్దేశించింది. తొలుత గ్రామ పంచాయతీ స్థాయి, ఆ తర్వాత కాంప్లెక్స్ పరిధి, మండల పరిధి, సమీప మండల పరిధి, చివరగా జిల్లాలోని మండల పరిధికి డిప్యుటేషన్లను పరిమితం చేయాలని సూచించింది. ఈ సర్దుబాటు ప్రక్రియంతా జిల్లా కలెక్టర్ అనుమతితోనే నిర్వహించాల్సి ఉంటుంది.
⇒ ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ తప్పకుండా ఉండాలి.
⇒ 220 మంది విద్యార్థులున్న హైస్కూల్లో కనీసం ఏడుగురు టీచర్లుండాలి.
⇒ 221–250 మధ్య విద్యార్థులుంటే 8 మంది టీచర్లు, 251–280 మంది ఉంటే 9 మంది టీచర్లుండాలి. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ పెరగాలి.