రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం | State Govt Orders Appointing New Chairman For Two Corporations In Telangana | Sakshi
Sakshi News home page

రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

Jun 22 2022 1:28 AM | Updated on Jun 22 2022 1:28 AM

State Govt Orders Appointing New Chairman For Two Corporations In Telangana - Sakshi

సతీశ్‌రెడ్డి, అనిల్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల పరిధిలోని రెండు కార్పొరేషన్లకు నూతన చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్‌ శాఖ పరిధిలోని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల కార్పొరేషన్‌ (రెడ్కో) చైర్మన్‌గా ఏరువ సతీశ్‌రెడ్డి, సమాచార, ప్రజా సంబంధాల శాఖ పరిధిలోని సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్‌ కూర్మాచలం నియమితులయ్యారు.

వీరు ఆ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగుతారని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన సతీశ్‌రెడ్డి 2020 నుంచి టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కమిటీ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2018 ప్రగతి నివేదిక సభ డిజిటల్‌ మీడియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన అనిల్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం యూకే శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్, తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యూకే వ్యవస్థాపక సభ్యుడిగా క్రియాశీలకపాత్ర పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement