సమతాస్ఫూర్తికి ప్రాణప్రతిష్ట.. వైభవంగా అంకురార్పణ కార్యక్రమం | Sri Ramanuja Millennium Celebrations To Commence From Feb 2 | Sakshi
Sakshi News home page

సమతాస్ఫూర్తికి ప్రాణప్రతిష్ట.. వైభవంగా ప్రారంభమైన అంకురార్పణ కార్యక్రమం

Feb 2 2022 1:20 AM | Updated on Feb 2 2022 1:50 PM

Sri Ramanuja Millennium Celebrations To Commence From Feb 2 - Sakshi

యాగశాలలో సిద్ధమైన హోమకుండాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో భారీ ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా భాసిల్లే స్థాయిలో రూపు దిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి బుధవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జీయర్‌ స్వాములు, మఠాధిపతులు, ద్వైత, అద్వైతంలో పెద్దవారంతా పాల్గొన్నారు.  శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామనుజ జైస్వామి వారు కార్యక్రమ వైభవాన్ని తెలిపారు. మంగళ శాసనాలు అందించారు. శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో 45 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ అద్భుత, దివ్య క్షేత్రం.. భక్తుల సందర్శనకు వీలుగా త్వరలో ప్రారంభం కాబోతోంది.

1,035 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయా లను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధా రణ చేసి పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం కుండల్లోని పుట్టమట్టిలో నవధాన్యాలను అలకటం ద్వారా అంకురార్పణ చేయనున్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగనున్నాయి.

భారీ విగ్రహం.. 108 ప్రధాన క్షేత్రాలు
216 అడుగుల ఎత్తులో కూర్చున్న భంగిమలో దేశంలో తొలి, ప్రపంచంలో రెండోదిగా కీర్తికెక్కిన రామానుజుల భారీ పంచలోహ సమతామూర్తి విగ్రహం ఈ కేంద్రంలో ప్రధానాకర్షణగా నిలవ నుంది. భారీ విగ్రహమే కాకుండా వైష్ణవ సంప్రదా యంలో అత్యంత ప్రాధాన్యమున్న దివ్య దేశాలుగా పేర్కొనే దేశంలోని 108 ప్రధాన క్షేత్రాల నమూ నాలు ఇక్కడ నిర్మించారు. భారీ విగ్రహం దిగువన 120 కిలోల స్వర్ణమయ 54 అంగుళాల రామాను జుల అర్చామూర్తితో కూడి ఆలయం కూడా ఆకట్టు కోనుంది. ఈ బృహత్తర క్షేత్రంలో అడుగడుగునా ఆధునిక సాంకేతికతను వాడి సంతృప్తిదాయక క్షేత్ర సందర్భన అనుభూతి కలిగేలా రూపొందించారు. 

సమానత్వ స్ఫూర్తి చాటేలా..
వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమ యంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ప్రబోధించి సమానత్వ భావాలు నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి కంటకంగా మారు తున్న నేపథ్యంలో ఆయన స్ఫూర్తి మరోసారి సమా జంలో పాదుకోవాల్సిన అవసరం ఉందంటూ చినజీయర్‌ స్వామి ఈ బృహత్‌ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు.

దాతల విరాళాలతో ఆరేళ్లలోనే ఈ భారీ కేంద్రం రూపుదిద్దుకుంది. రామానుజులు అవ తరించి వెయ్యేళ్లు గడుస్తున్న నేపథ్యంలో శ్రీ రామా నుజ సహస్రాబ్ది సమారోహంగా ఈ క్రతువును ప్రారంభిస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఓ గుడిలా భావించకుండా, సమాజంలో సమానత్వ భావనల ను విస్తరించేలా చేసేందుకు రామానుజుల ప్రబోధాలు జనంలోకి వెళ్లేలా రూపొందించారు. ఆధునిక అగుమెంటెడ్‌ రియాలిటీ ఆధారిత 18 నిమిషాల లేజర్‌ షో ద్వారా నిత్యం భక్తుల మదిని తాకేలా ఏర్పాట్లు చేశామని జీయర్‌ స్వామి చెబుతున్నారు. సమాజానికి అందించిన అద్భుతమైన 9 గ్రంథాల సారాన్ని అందించేలా డిజిటల్‌ లైబ్రరీ, సమానత్వ భావాలను సమాజానికి అందించిన విశ్వవ్యాప్త సమతామూర్తుల వివరాలు అందించే హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ను సిద్ధం చేశారు. 

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 5న వేడుక లకు హాజరుకాను న్నారు. రామానుజుల భారీ సమతామూర్తి విగ్ర హాన్ని ఆవిష్కరించను న్నారు. 7న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, 8న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రానున్నారు. 13న రాష్ట్రపతి ఉత్సవ మూర్తిని దర్శించుకోనున్నారు.

అలాగే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల కీలక నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు, వివిధ పీఠాధిపతులు కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. భక్త జనం కూడా భారీగా తరలివస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement