ఎస్సెస్సీ.. ఇంజనీర్! | Special Story On SSC Engineer In Khammam | Sakshi
Sakshi News home page

ఎస్సెస్సీ.. ఇంజనీర్!

Jun 15 2025 3:58 PM | Updated on Jun 15 2025 4:05 PM

Special Story On SSC Engineer In Khammam
  • పదో తరగతి చదివి ఇంజనీర్ పనుల్లో రాణిస్తున్న సుధాకర్
  • రైస్ మిల్లుల నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యం  
  • 33 ఏళ్లలో 110 మిల్లులు ఫిట్టింగ్ చేసి సత్తాచాటుతున్న వైనం

ముదిగొండ: చదివింది పదో తరగతే... కానీ చిన్నతనం నుంచే ఇంజనీర్ కావాలన్న పట్టుదలను మాత్రం వీడలేదు. ఓ రైస్ మిల్లు మెకానిక్ వద్ద కొన్నేళ్లు పని నేర్చుకుని.. ఆతర్వాత సొంతంగా చిన్నచిన్న మరమ్మతులు చేయ డం మొదలుపెట్టాడు. ఆపై సొంతంగా కొత్త రైస్ మిల్లుల్లో పరికరాలు బిగించే స్థాయికి చేరాడు. ఒకటి కాదు రెండు కాదు 33 ఏళ్ల కాలంలో 110 మంది రైస్ మిల్లుల ఏర్పాటులో భాగంగా పంచుకున్న వ్యక్తి విజయగాథ ఇది. మిత్రులను చూస్తూ..

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన తునికిపాటి సుధాకర్ పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఆతర్వాత ఆయన పదో తరగతి మెమో పోయింది. డూప్లికేట్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆయన స్నేహితులు ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ విద్య మొదలుపెట్టారు. అయినప్పటికీ ఉన్నత విద్య చదవాలనే పట్టుదల వీడని సుధాకర్ ఎలా ముందుకు సాగాలా అని ఆలోచనలో పడ్డాడు. ఇంటర్ పాస్ అయి, బీటెక్ చదవాలంటే నాలుగేళ్లు పడుతుంది. ఆతర్వాత ఎంచుకున్న విభాగం లోనూ స్థిరపడాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. కానీ సుధాకర్కు మెకానికల్ ఇంజనీర్ కావాలని ఉండటం, చదివే పరిస్థితులు లేక తొలుత రైస్ మిల్లు మెకానిక్ వద్ద శిక్షణ ఆరం భించాడు. కొన్నేళ్లు ఆయన శిక్షణ రాటుదేలాక సొంతంగా మరమ్మతులు చేయడం మొదలుపెట్టాడు.

కొత్త మిల్లులపై దృష్టి
చాన్నాళ్లు రైస్ మిల్లు మరమ్మతుల రంగంలో పనిచేసిన సుధాకర్ నైపుణ్యం సాధించాడు. ఆతర్వాత కొత్త మిల్లుల ఏర్పాటుపై దృష్టి సారించాడు. ఇలా 33 ఏళ్లలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో 110 మిల్లుల ఏర్పాటులో భాగం పంచుకున్నాడు. ఏ స్థాయి మిల్లు అయినా సరి యజమానుల సూచనలతో కావాల్సిన విడిభాగాలు తెప్పించడం.. చకచకా రోజుల వ్యవధిలోనే మిల్లులు సిద్దం చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. విడిభాగాలు తెప్పిం చడం, అమర్చడం, విద్యుత్, వెల్డింగ్ ఇలా అన్నీ ప్రక్రియల్లో నైపుణ్యం సాధించినా సహాయకులతో కలిసి నెలలోగా మిల్లును సిద్ధం చేస్తుండటం విశేషం. అంతేగాక తాను అమర్చిన మిల్లుల్లో ఏ సమస్య వచ్చినా త్వరగా మరమ్మతు చేసి పనులు ఆగకుండా చూస్తుండటంతో పలు జిల్లాల్లో పేరు సాధించాడు.

ఎక్కడెక్కడ..?: 
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ రైస్ మిల్లు షెడ్డులో పరికరాలు జిల్లాల్లోనే కాక ఏపీలోని పలు ప్రాంతాల్లో సుధాకర్ రైస్ మిల్లులు సిద్ధం చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో రైస్ మిల్లుల ఏర్పాటులో భాగం పం చుకున్నాడు. మిల్లుల ఏర్పాటుకు కావాల్సిన పరికరాలను విజయవాడ, బెంగళూరు, చైన్నై, హైదరాబాద్లో యజమానులతో తెప్పించి.. సామర్థ్యం మేరకు రోజుల వ్యవధిలోనే మిల్లులను సిద్ధం చేస్తుంటామని సుధాకర్ తెలిపారు.

మూడు మిల్లులు సుధాకర్తోనే..
2004లో పాల్వంచ సమీపాన పాండురంగాపురం, 2015లో తోడేళ్లగూడెం, 2023లో మిట్టపల్లిలో మూడు రైస్ మిల్లులు ఏర్పాటుచేశాం. ఈ పనులన్నీ సుధాకర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. మిల్లుల ఏర్పాటు పనులే కాక ఏ చిన్న మరమ్మతు వచ్చినా చేస్తాడు. తద్వారా మాతో పాటు రైతులకు ఇక్కట్లు లేకుండా పనులు సాగుతున్నాయి.
- ఇలవల సంజీవరెడ్డి,
పొందురంగాపురం, పాల్వంచ మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement