SLBC టన్నెల్‌లో మరో మృతదేహం వెలికితీత | Slbc Tunnel: Search Operation Continues March 25th Updates | Sakshi
Sakshi News home page

SLBC టన్నెల్‌లో మరో మృతదేహం వెలికితీత

Mar 25 2025 10:22 AM | Updated on Mar 25 2025 3:35 PM

Slbc Tunnel: Search Operation Continues March 25th Updates

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యమైంది. లోకో ట్రాక్​ సమీపంలో మృతదేహం ఉన్నట్లు రెస్క్యూ బృందం గుర్తించింది.

సాక్షి, నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వారి స్వగ్రామానికి తరలించనున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.

లోకో ట్రాక్​ సమీపంలో మృతదేహాన్ని గుర్తించా. లోకో ట్రైన్​ శిథిలాల కింద డెడ్​బాడీని గుర్తించిన రెస్క్యూ బృందాలు.. తవ్వకాలు చేపట్టాయి. ఘటన స్థలం నుంచి  మృతదేహాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకి తీసుకువచ్చారు. శిథిలాలను గ్యాస్​ కట్టర్‌తో తొలగిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా గడిచినా, ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది కార్మికులలో ఇద్దరిని వెలికితీశారు.ఇక ఆరుగురి మృతదేహాలను వెలికితీయడానికి సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 8 మంది లోపల చిక్కుకుపోగా, ఇప్పటివరకు రెండు మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు.

కాగా, నిన్న(సోమవారం) అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం, సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రభుత్వం సొరంగంలో సహాయక చర్యలు నిలిపివేస్తారన్న అందరి అంచనాలు తారుమారయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించలేమని సహాయక బృందాలు చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో మరికొన్ని రోజులపాటు ఆపరేషన్‌లో పాల్గొననున్నారు. 30 మీటర్ల  వద్ద అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తే సహాయక సిబ్బంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లనుందని నిపుణులు హెచ్చరించారు.

SLBC టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు

సొరంగం కుప్పకూలిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక సిబ్బంది సోమవారం 31వ రోజు సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్‌తో కట్‌ చేసి బయటకి తెస్తున్నారు. మట్టి, రాళ్ల దిబ్బలు, బురద పూడిక, ఉబికి వస్తున్న నీటిని వాటర్‌ జెట్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ నుంచి ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు వద్ద గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో విద్యుత్, వెంటిలేషన్‌ పనులను పునరుద్ధరిస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాద జోన్‌గా అధికారులు గుర్తించారు. నేషనల్‌ జియో లాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌డీఆర్‌ఐ నిపుణుల నివేదిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసా గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎక్స్‌ఫర్ట్‌ కమిటీని కూడా నియమించి వారి సూచనలు, సలహాల మేరకు పనులు కొనసాగించనున్నారు. కేరళ నుంచి వచ్చిన కాడవర్స్‌ డాగ్స్‌  గుర్తించిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో చేపడుతున్న సహాయక చర్యలకు టీబీఎం భాగాలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. అదేవిధంగా సొరంగం తవ్వకాలకు మినీ హిటాచీ, కన్వేయర్‌ బెల్టు, డీవాటరింగ్‌ పైపులు కూడా అడ్డు పడుతున్నాయి. సింగరేణి, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, దక్షిణమధ్య రైల్వే, హైడ్రా, ర్యాట్‌ హోల్స్‌ మైనర్స్, ఆర్మీ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement