నేటి నుంచి నిందితుల ఉమ్మడి విచారణ

SIT investigation intensified in TSPSC paper leak case - Sakshi

టీఎస్‌పీఎస్సీ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం 

మొత్తం 30 ప్రశ్నలతో ప్రత్యేక ప్రశ్నావళి రూపకల్పన 

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు 

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వస్తే మరింత స్పష్టత! 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలతో సహా తొమ్మిది మంది నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే. వీరిని శని, ఆదివారాల్లో విడివిడిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నమోదు చేసిన వాంగ్మూలాలను సరిపోల్చుతూ మొత్తం 30 ప్రశ్నలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసింది. దీని ఆధారంగా సోమవారం నుంచి నిందితులను ఉమ్మడిగా ప్రశ్నించాలని నిర్ణయించింది.

ప్రవీణ్‌–రాజశేఖర్, ప్రవీణ్‌–రేణుక, రాజశేఖర్‌–రేణుక.. ఇలా ఇద్దరిద్దరు చొప్పున, ఆ తర్వాత అందరినీ కలిపి ప్రశ్నించడానికి సిద్ధమైంది. మరోవైపు ఇప్ప­టికే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పా­టు టీఎస్‌పీఎస్సీ నుంచి సీజ్‌ చేసిన కంప్యూట­ర్‌ తదితరాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు (ఎఫ్‌ఎస్‌ఎల్‌కు) పంపింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి నివేదిక అందిన తర్వత కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.  

గ్రూప్‌–1 డిస్‌ క్వాలిఫై వెనుక కుట్ర! 
కమిషన్‌ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌ కుమార్‌ గ్రూప్‌–1 పరీక్షలో డిస్‌ క్వాలిఫై కావడం వెనుకా కుట్ర ఉందని సిట్‌ అనుమానిస్తోంది. ప్రవీణ్‌ ఆ పేపర్‌ కూడా చేజిక్కించుకున్నాడని, దాని ఆధారంగా పరీక్ష రాసి 150కి 103 మార్కులు సాధించాడని భావిస్తోంది. ఈ లీకేజ్‌ విషయం వెలుగులోకి రాకుండా ఉండటానికే ఓఎంఆర్‌ షీట్‌ను తప్పుగా నింపి డిస్‌ క్వాలిఫై అయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

అలా చేస్తే ఎవరి దృష్టిలోనూ పడమని, తనకు ఎలాగూ ఎక్కువ మార్కుల రావడంతో ఆ తర్వాత అదును చూసుకుని మెయిన్స్‌ పరీక్ష లోపు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ఆ పరీక్ష రాయడానికి అనుమతి పొందాలనే పథకం వేశాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. మెయిన్స్‌ పేపర్‌ను సైతం చేజిక్కించుకునేందుకు ప్రవీణ్‌ పథకం వేశాడని అనుమానిస్తున్నారు.

తనతో సన్నిహితంగా ఉన్న రేణుకతో ప్రవీణ్‌ ఈ వ్యవహారం చెప్పి ఉంటాడని, ఈ నేపథ్యంలోనే ఆమె మిగిలిన ప్రశ్నపత్రాల లీకేజ్‌ ఆలోచన చేసి ఉంటుందని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి జరిగే విచారణలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. 

మంచి మార్కులు వచ్చిన వారిపై నజర్‌ 
గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించిన వారినీ సిట్‌ అనుమానితులుగా చేర్చింది. ప్రాథమికంగా 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 28 మందితో జాబితా రూపొందించారు. వీరి కాల్‌ డిటైల్స్, వాట్సాప్‌ వివరాల్లో.. నిందితులతో లింకుల కోసం సాంకేతికంగా ఆరా తీస్తున్నారు.

గ్రూప్‌–1 పేపర్‌ ప్రవీణ్‌ లేదా మరెవరి ద్వారా అయినా వారికి అందిందా? అనే అంశంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వీరిలో కొందరిని సిట్‌కు పిలిచి విచారించారు. కొందరు యూపీఎస్సీతో పాటు ఇతర పరీక్షలు కూడా రాసి మంచి మార్కులు పొందినట్లు గుర్తించారు.

ఇద్దరి వ్యవహారశైలిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని మరికొన్ని కోణాల్లోనూ ప్రశ్నించనున్నామని ఓ అధికారి తెలిపారు. ఆదివారం అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌తో కలిసి హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి వెళ్లిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వివిధ సాంకేతిక అంశాలను పరిశీలించారు.  

మరింత మందికి పేపర్లు! 
రెండోరోజు నిందితులను 7 గంటలకు పైగా సిట్‌ విచారించింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలకు చెందిన వాట్సాప్‌ చాట్లను సైబర్‌ నిపుణులు రిట్రీవ్‌ చేశారు. వాటిని నిందితుల ముందుంచి ప్రశ్నించా­రు. వా­ట్సా­‹­³­లు పరిశీలించిన నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వ­చ్చాయి. ప్రవీణ్, రా­జ­శేఖర్, రేణుకలు చా­లా­మందికి ప్రశ్నపత్రా­లు పంపినట్లుగా ఆధారాలు లభించా­యి.

గ్రూ­ప్‌–1 పేపర్‌­ను కూడా చాలా­మందికి సర్క్యులేట్‌ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్‌ వినియోగించిన కంప్యూటర్ల నుంచి డేటాను రిట్రీవ్‌ చేసేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించారు. పేప­ర్లు అందుకున్న వారిని నిందితుల జాబితా­లో చేర్చి ప్రశ్నించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top