సీఈఐఆర్‌తో 2,43,875 మొబైల్‌ ఫోన్లు గుర్తించాం | Sancharsathi portal is available from today | Sakshi
Sakshi News home page

సీఈఐఆర్‌తో 2,43,875 మొబైల్‌ ఫోన్లు గుర్తించాం

May 17 2023 2:34 AM | Updated on May 17 2023 2:34 AM

Sancharsathi portal is available from today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌: చోరీకి గురైన, కనిపించకుండా పోయిన మొబైల్‌ ఫోన్లను గుర్తించేందుకు అమల్లోకి తెచ్చిన సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,43,875 మొబైల్‌ ఫోన్లను గుర్తించినట్టు టెలికాం స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్‌ సాథీ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.

మంగళవారం సికింద్రాబాద్‌లోని సీటీఓ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోర్టల్‌లోని టాప్‌కాఫ్‌ (టీఏఎఫ్‌సీఓపీ) మాడ్యుల్‌ ద్వారా ఒక ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌కార్డులు వాడుతున్నారనేది తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల మన గుర్తింపు కార్డుతో ఎవరైనా సిమ్‌లు వాడుతుంటే గుర్తించవచ్చన్నారు. అదే పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేసి, సిమ్‌లను బ్లాక్‌ చేయవచ్చని చెప్పారు.

టాప్‌కాఫ్‌ను ఏపీఎల్‌ఎస్‌ఏ విజయవాడ బ్రాంచ్‌ తయారు చేయగా ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్నామని ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.87లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 కనెక్షన్లు రద్దుచేసినట్లు చెప్పారు. సైబర్‌క్రైమ్, బ్యాంకింగ్‌ మోసాలను నిరోధించేందుకు ఈ పోర్టల్‌ ఉపయోగపడుతుందని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement