
కొత్తగా సన్నరకం వరి వంగడాలను అభివృద్ధి చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం
నాణ్యమైన వంగడాలను అందుబాటులోకి తెస్తున్న వరి పరిశోధన కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: తక్కువ పంట కాలంలో అధిక దిగుబడి ఇచ్చే వరి సాగు వైపు తెలంగాణ రైతులు మొగ్గుచూపుతున్నారు. క్రమక్రమంగా దొడ్డు ధాన్యం పండించే రైతుల సంఖ్య తగ్గుతుండగా, సన్నాలే ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి సీజన్లో కూడా భారీ ఎత్తున సన్నాల సాగు చేయడం, పౌరసరఫరాల సంస్థకు ఏకంగా 23 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం విక్రయించడమే అందుకు తార్కాణం. ఈ పరిస్థితుల్లో రైతులకు ఉపయోగకరంగా ఉండేలా, తక్కువ పంట కాలంలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే సన్న రకం వరి వంగడాలను అభివృద్ధి చేస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.
రాష్ట్రంలోని ఆరు వరి పరిశోధన కేంద్రాల ద్వారా నిరంతరం వరి విత్తనాలపై పరిశోధనలు సాగిస్తూ... తెలంగాణ వాతావరణానికి అనువుగా ఉండే కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. సాధారణంగా వరి పంట కాలం 130 నుంచి 140 రోజుల వరకు ఉంటుంది. 115 రోజుల నుంచి 125 రోజుల్లో పంట దిగుబడి వచ్చేలా కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు.
సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా...
అత్యధికంగా సాగయ్యే సన్న రకాల్లో సాంబమసూరి (బీపీటీ–5204) ముందు వరుసలో ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు పలు ప్రత్యామ్నాయ రకాలను అభివృద్ధి చేశారు. బీపీటీ 5204 గింజ నాణ్యతతో 120–125 రోజుల పంట కాలంలో అధిక దిగుబడిని ఇచ్చేలా అభివృద్ధి చేసిన వంగడాలను రైతులకు అందుబాటులోకి తెచ్చినట్టు వర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. సిద్ధి (డబ్ల్యూజీఎల్–44) 2012 నుంచే అభివృద్ధి చేయగా, కొత్తగా కేఎన్ఎం –7715, కేఎన్ఎం 12472లను అభివృద్ధి చేశారు. ఇదే క్వాలిటీతో జేజీఎల్–28545, జేజీఎల్–33124, ఆర్డీఆర్–1200 రైతులకు ఆయా రైతు పరిశోధన కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి.
జై శ్రీరాం వంటి ప్రైవేటు రకాలకు దీటుగా ..
అతి సన్నరకం బియ్యం వచ్చే జైశ్రీరాం, చింటూ జైశ్రీరాం ప్రైవేట్ వెరైటీలకు బహిరంగ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ రకం బియ్యం కిలో రూ.70 నుంచి రూ. 80 వరకు పలుకుతోంది. కాగా ఇదే నాణ్యతతో వర్సిటీ శాస్త్రవేత్తలు జగిత్యాల వరి పరిశోధన కేంద్రంలో జేజీఎల్ –27356 రకాన్ని ఇప్పటికే అభివృద్ధి చేశారు. నాణ్యతతో, రోగాలను తట్టుకొనేలా 125 రోజుల్లో పంట చేతికొచ్చేలా ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు.
రాజేంద్రనగర్లో అభివృద్ధి చేస్తున్న మరో వంగడం ఆర్ఎన్ఆర్–31479ను త్వరలో విడుదల చేయనున్నారు. వీటితోపాటు ఆర్డీఆర్ –1162 కూడా జైశ్రీరాం, హెచ్ఎంటీకి దీటుగా ఉంటుంది.
తెలంగాణ సోనాకు ప్రత్యామ్నాయంగా ఆరు రకాలు
వానాకాలం, యాసంగి సీజన్లలో సాగు చేసేందుకు అనువైన అత్యంత ఆదరణ పొందిన రకం తెలంగాణ సోనా. ఆర్ఎన్ఆర్ –15048గా పిలిచే 125 రోజుల పంటకాలపు ఈ వంగడానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా అవే లక్షణాలతో మరో ఐదారు రకాల వంగడాలను వర్సిటీ అభివృద్ధి చేస్తోంది. కేఎన్ఎం–1638 ఇప్పటికే మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉండగా, మరో ఐదు వంగడాలను పంట క్షేత్రాల్లో అభివృద్ధి చేస్తున్నారు.
కేఎన్ఎం–12368, కేఎన్ఎం–12510, కేఎన్ఎం– 7715, కేపీఎస్–10631, కేపీఎస్–10642 రకాలను తెలంగాణ సోనా లక్షణాలతో రోగాలను తట్టుకొని, తెలంగాణ వాతావరణంలో మనుగడ సాధించేలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పంట దిగుబడి కూడా 30 క్వింటాళ్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దొడ్డు రకం ఎంటీయూ 1010 నాణ్యతతో కూడా..
దొడ్డు రకం సాగులో అధికంగా వినియోగించే వంగడం ఎంటీయూ 1010. వెయ్యి పదిగా పిలవబడే ఈ పంట ఉత్తర తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎకరాకు 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చేలా మరో నాలుగు రకాలను విశ్వవిద్యాలయ వరి పరిశోధన కేంద్రం విడుదల చేసిందని ప్రిన్సిపల్ సైంటిస్ట్ చంద్రమోహన్ తెలిపారు. కేఎన్ఎం 118, ఆర్ఎన్ఆర్ 28361, ఆర్ఎన్ఆర్ 29325, జేజీఎల్ 28639 రకాలు అధిక దిగుబడిని ఇస్తాయని తెలిపారు.