సీఎంకు ‘హిట్లర్‌’ సెగ! | Revanth Reddys comments caused a national uproar | Sakshi
Sakshi News home page

సీఎంకు ‘హిట్లర్‌’ సెగ!

Jun 8 2026 2:55 AM | Updated on Jun 8 2026 3:59 AM

Revanth Reddys comments caused a national uproar

హిట్లర్‌ స్ఫూర్తితో హైడ్రాకు నామకరణం చేసినట్లు సీఎం వ్యాఖ్యలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌  విమర్శలు

ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ అంటూ విమర్శించిన జాతీయ మీడియా  

హైడ్రా పేరుతో హిట్లర్‌ కోర్‌ టీమ్‌నురూపొందించినట్లు ఆధారాల్లేవు 

చరిత్రకారులు స్పష్టం చేసినట్లు సౌత్‌ఫస్ట్‌ వంటి వార్తాసంస్థల్లో కథనాలు

సాక్షి, హైదరాబాద్‌: జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా విమర్శించగా, జాతీయ మీడియా సైతం ‘ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌’గా అభివర్ణించింది. హిందూ గ్రూప్‌ శనివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి సంభాషిస్తూ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.

‘హైడ్రా పదం హిట్లర్‌కు ఫేవరేట్‌ పదం. అతడి కోర్‌ టీమ్‌ పేరు హైడ్రా. ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్‌ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టి ఒక సంస్థను స్థాపించాను. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జలవనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి..’ అని హైడ్రాపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి బదులిచ్చారు. హైదరాబాద్‌ మహానగరం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024లో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో సంస్థను స్థాపించడం తెలిసిందే. 

ఇప్పటివరకు కబ్జాదారుల చెర నుంచి రూ. 80,000 కోట్ల విలువైన 2,182 ఎకరాల భూమిని స్వా«దీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైడ్రా కార్యకలాపాలు ఆది నుంచి వివాదాలు, విమర్శలకు దారితీశాయి. రాష్ట్రంలో బుల్డోజర్‌ పాలన జరుగుతోందని ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఆరోపణలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించి వివాదాల్లో ఉన్న స్థలాల్లోని కట్టడాల కూల్చివేతలు చేపట్టడాన్ని యుద్ధ వాతావరణంతో రాష్ట్ర హైకోర్టు పోల్చింది. 

హైడ్రా చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ను విచారణకు పిలిపించి మొట్టికాయలు సైతం వేసింది. హైడ్రా ఎడాపెడా కూల్చివేతలు జరుపుతుండటంతో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందని విపక్షాలు ఆరోపణలూ చేశాయి. ఇప్పటికే హైడ్రా పనితీరుపై విమర్శలు, లెక్కలేనన్ని కోర్టు కేసులుండగా హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థకు నామకరణం చేసినట్లు సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించడం మరింత దూమారం రేపింది. హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్‌ యుద్ధ విధ్వంసాలతో పోల్చడాన్ని విపక్షాలు విమర్శించాయి.   

బీజేపీ, బీఆర్‌ఎస్‌ విమర్శలు.. 
‘హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మళ్లీ బహిర్గతమైంది. హిట్లర్‌ స్ఫూర్తి కలిగించాడని రేవంత్‌రెడ్డి బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ నుంచి హిట్లర్‌ వరకు ఎల్లప్పుడూ కాంగ్రెస్‌ ప్రజలను అణచివేసింది. రేవంత్‌రెడ్డి సిగ్గుతో తలవంచి క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ఎక్స్‌’లో డిమాండ్‌  చేశారు. మరో కేంద్ర మంతికిరణ్‌ రిజిజు సైతం ‘ఎక్స్‌’లో ఘాటుగా స్పందించారు. ‘వాహ్‌.. కాంగ్రెస్‌ సీఎం హిట్లర్‌తో పూర్తిగా స్ఫూర్తి పొందారు. ఒకవేళ బీజేపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మా వ్యతిరేకులందరూ నాజీయిజం, ఫాసిజం అంటూ విమర్శలు చేసేవారు’ అని ఆయన విమర్శించారు. 

‘ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మొదలు రేవంత్‌రెడ్డి జర్నలిస్టులు, విద్యార్థులను అరెస్టు చేయడం వరకు.. ఇది కాంగ్రెస్‌ తానాషాహీ మనస్తత్వం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజలకు ఇది ముందే తెలుసు. యావత్‌ దేశానికి స్పష్టత ఇచ్చినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు’ అని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక హైడ్రాను రద్దు చేస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేస్తామని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

హిట్లర్‌ కోర్‌ టీమ్‌కు హైడ్రా పేరు లేదు 
హిట్లర్‌ కోర్‌ టీమ్‌కు హైడ్రా అనే పేరు ఉన్నట్లు చరిత్రలో ఆధారాలు లేవని చరిత్రకారులు అభిప్రాయపడుతున్న ట్లు సౌత్‌ ఫస్ట్, మరికొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి 1943 ఆగస్టు 17–18 రాత్రి బ్రిటన్‌ ఆపరేషన్‌ హైడ్రా పేరుతో నాజీల వీ–ఆయుధ కార్యక్రమంపై బాంబు దాడి చేసిందని గుర్తుచేశాయి. మార్వెల్‌ కామిక్‌ పుస్తకం, సినిమాల్లోని ఊహాజనిత నియో–ఫాసిస్ట్‌ సంస్థ ‘హైడ్రా’తో సీఎం పొరబడినట్లు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement