SLBC: రోబోలతో సెర్చ్‌ ఆపరేషన్‌.. టన్నెల్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదే | Rescue Operation In Slbc Tunnel Continues For 23 Days | Sakshi
Sakshi News home page

SLBC: రోబోలతో సెర్చ్‌ ఆపరేషన్‌.. టన్నెల్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదే

Mar 16 2025 3:44 PM | Updated on Mar 16 2025 4:54 PM

Rescue Operation In Slbc Tunnel Continues For 23 Days

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.

సాక్షి, మహబూబ్‌నగర్‌ జిల్లా: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం అయింది. మిగిలిన ఏడు మృతదేహాల కోసం  నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది.

రోబోల వినియోగంతో సహాయక చర్యలు ముమ్మరం అవుతాయని భావిస్తున్నా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. అటానమస్ హైడ్రాలిక్ పవర్‌ రోబోలు మూడింటిని వినియోగించనున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి వెయ్యి క్యూబిక్ మీటర్ల సామర్ద్యం గల బురద, మట్టిని తొలగిస్తోంది. మానవుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోల పని చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు.

రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్‌మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.

గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్‌తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement