ప్చ్‌... బాగోలేదు

RBI Consumer Confidence Survey September 2020 - Sakshi

ప్రజల ఆర్థిక స్థితిపై ఆర్‌బీఐ సర్వేలో నెటిజన్లు

ఉపాధి దెబ్బతిందని 81.7 శాతం మంది అభిప్రాయం

ధరల పెరుగుదల భారమన్న 82.9 శాతం మంది

కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే సెప్టెంబర్‌–2020ని విడుదల చేసిన ఆర్‌బీఐ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ దాడి చేసి 8 నెలలు దాటి పోయింది. అన్‌లాక్‌లతో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అయినా తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, గత ఏడాదితో పోలిస్తే మరింత దిగజారిందని ప్రజలు చెబుతున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్వహించే ద్వైమాసిక సర్వేల్లో నెటిజన్లు ఈ మేరకు అభిప్రాయ పడ్డారు. కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే (సెప్టెం బర్‌–2020) పేరిట తాజాగా ఆర్‌బీఐ విడుదల చేసిన సర్వే ప్రకారం తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని కేవలం 9 శాతం మంది మాత్రమే చెప్పారు. సర్వేలో పాల్గొన్న మిగిలిన నెటిజన్లంతా బాగోలేదని, దిగజారిందని, ఏమీ చెప్పలేమని సమాధానాలిచ్చారు. అయితే వచ్చే ఏడాదికల్లా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, ఉపాధి అవ కాశాలు... తదితర అన్ని అంశాల్లోనూ ఇంకా తాము కోలుకోలేదని చెప్పారు.

అన్నింటిలోనూ తిరగోమనమే
హైదరాబాద్‌తో సహా దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ఆర్‌బీఐ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ఆర్థిక సంబంధిత అన్ని అంశాల్లోనూ ఇంకా తిరోగమన పరిస్థితే ప్రస్పుటమైంది. ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి బాగుందని, మెరుగుపడిందని 9 శాతం మంది చెప్పగా, బాగాలేదని 11.4 శాతం, దిగజారిందని, 79.6 శాతం చెప్పారు. వచ్చే ఏడాది కల్లా గాడిలో పడుతుందని 50.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని కేవలం 10.1 శాతం మందే చెప్పగా, ఆదాయం పెరిగిందని 8.9 శాతం, ఖర్చు పెరిగిందని 47.2 శాతం మంది చెప్పడం గమనార్హం. ఇక, ధరల పెరుగుదలకు సంబంధించి మరింత ఆసక్తికర విషయాలు ఈ సర్వేలో వెల్లడయ్యాయి. ధరలు పెరుగుతున్నాయని 82.9 శాతం మంది చెప్పగా, వచ్చే ఏడాది వరకు ఈ ప్రభావం ఉంటుందని, అప్పుడు కూడా పెరుగుతాయని 69.5 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. 

కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే వివరాలివి:
పరిస్థితి        బాగుంది    బాగాలేదు    దిగజారింది        వచ్చే ఏడాది ఓకే    
ఆర్థిక               9.0        11.4        79.6                 50.1
ఉపాధి            10.1        8.1        81.7                  54.1
ఆదాయం        8.9        28.4        62.7                  53.2
(అదే విధంగా ధరల పెరుగుదలకు సంబంధించి 82.9 మంది ధరలు పెరిగాయని, 14.6 శాతం మంది అలాగే ఉన్నాయని, 2.5 శాతం మంది మాత్రమే తగ్గాయని చెప్పారు. వచ్చే ఏడాది కూడా పెరుగుతాయని 69.5 శాతం, అలాగే ఉంటాయని 20.5శాతం, తగ్గుతాయని 10శాతం మంది అభిప్రాయపడ్డారు.) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top