హైదరాబాద్లో భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరద నీరు చేరుకోవడంతో బస్తీల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. తాజాగా పురానాపూల్ ప్రాంతంలోకి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దానిని పట్టుకొని సంచిలో వేసి బంధించారు.
జలదిగ్బంధంలో చంద్రాయణగుట్ట
వర్షం తగ్గుముఖం పట్టిన చాంద్రాయణగుట్ట పరిసరప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదలో ప్రైవేట్ బస్సులు లారీలు కార్లు ఫంక్షన్ హాల్స్ చిక్కుకున్నాయి. బుధవారం వరద కారణంగా పక్కనే ఉన్న రైస్ మిల్లు నుంచి పెద్ద ఎత్తున వరదల్లో వరి ధాన్యం కొట్టుకొచ్చింది.
కొట్టుకుపోయిన కార్లు, బైకులు
సరూర్నగర్లో వరద ఇంకా కొనసాగుతుంది. ఎగువ చెరువుల నుంచి వస్తున్న నీటితో సరూర్ నగర్ చెరువు నిండు కుండలా మారింది. నీరు కిందకు వదలడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో కార్లు, బైకులు, సామాగ్రి కొట్టుకుపోయాయి.