36.10 లక్షల మంది చిన్నారులకు చుక్కలు..
రాష్ట్రంలో 22,979 బూత్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది. 0–5 ఏళ్లలోపు 36.10 లక్షల మంది చిన్నారులకు రెండు చుక్కల బైవేలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. ఆదివారం బూత్లలో, జూన్ 29–30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు టీకా అందిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై 1న కూడా కార్యక్రమం కొనసాగుతుంది.
ఇందుకోసం రాష్ట్రంలో 22,979 పోలియో బూత్లు, 903 మొబైల్ బృందాలు, 104 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటుచేశారు. తెలంగాణ 2007 నుంచి పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగుతోంది. చివరి పోలియో కేసు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నమోదైంది. వలస కార్మికులు, ఇటుక బట్టీలు, గిరిజన ప్రాంతాలు, పట్టణ మురికివాడల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.


