సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 9న తెలంగాణ పర్యటనకు రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రానికి ఆయన వస్తారని వెల్లడించాయి. 9న వరంగల్లో మామునూరు ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫేజ్–2ను జాతికి అంకితం చేయడంతోపాటు బీబీనగర్ ఎయిమ్స్ను కూడా జాతికి అంకితం చేసే అవకాశాలున్నాయి.
కాగా, మల్లారెడ్డి ఏఐ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారా? లేదా? అన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు తూళ్ల వీరేందర్గౌడ్, అశోక్ వేములతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, అంశాలపై చర్చించినట్టు తెలిపారు.


