
రైతులకు పోలీసుల సాయం
హాలియా: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడాన్ని గమనించిన స్పెషల్ పోలీస్ బృందం వాటిపై పట్టాలు కప్పి పంటను కాపాడింది. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలివి. అలీనగర్ ప్రాంతంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై కొందరు రైతులు ధాన్యం ఆరబోశారు. మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది.
అదే సమయంలో నల్లగొండ స్పెషల్ పోలీసులు నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తడుస్తున్న ధాన్యాన్ని చూసి చలించారు. తమ వాహనాన్ని ఆపి ధాన్యం తడవకుండా పట్టాలు కప్పి పంటను కాపాడారు. పంటను కాపాడిన స్పెషల్ పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.