3 నేషనల్‌ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన

PM Modi To Laid Foundation Stone For 3 National Highway Expansion - Sakshi

ఈనెల 12న రాష్ట్ర పర్యటనలో భాగంగా కార్యక్రమం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 12న రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈ రోడ్ల పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేయటం ఇదే మొదటిసారి. గతంలో మనోహరా బాద్‌–కొత్తపల్లి రైల్వే లైన్‌కు గజ్వేల్‌ కేంద్రంగా మోదీ శంకుస్థాపన చేశారు.

రోడ్డు పనులకు ఆ శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పుడు మొదటిసారి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. మెదక్‌– సిద్దిపేట–ఎల్కతుర్తి మధ్య 134 కి.మీ. నిడివితో విస్తరించే ఎన్‌హెచ్‌–265 డీజీ పనులు ప్రారంభిస్తారు. రెండు వరసలు, పేవ్డ్‌ షోల్డర్స్‌తో విస్తరించే ఈ పనులకు రూ.1461 కోట్లు వ్యయం అంచనా.

రెండు వరసలు, పేవ్డ్‌ షోల్డర్స్‌తో విస్తరించే బోధన్‌–బాసర–భైంసా రోడ్డు పనులు ప్రారంభిస్తారు. 56 కి.మీ. నిడివితో ఉండే ఈ రోడ్డు విస్తరణకు రూ.644 కోట్లు ఖర్చు కానున్నాయి. 17 కి.మీ. నిడివితో ఉండే సిరోంచ–మహదేవ్‌పూర్‌ సెక్షన్‌ పరిధిలో ఆత్మకూరు వరకు జరిగే రోడ్డు పనులను కూడా ప్రారంభిస్తారు. పేవ్డ్‌ షోల్డర్స్‌తో కూడిన ఈ రెండు వరసల రోడ్డు విస్తరణకు రూ.163 కోట్లు వ్యయం కానుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top