పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు రానివ్వం | Pharma companies should allocate CSR funds: Minister Komatireddy | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు రానివ్వం

Jul 6 2024 3:59 AM | Updated on Jul 6 2024 4:01 AM

Pharma companies should allocate CSR funds: Minister Komatireddy

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో 73వ ఇండియన్‌ పార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించిన డిప్యూటి సీఎం భట్టివిక్రమార్కమల్లు, మంత్రులు శ్రీధర్‌బాబు, కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు.

ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నెముక లాంటిది

ఫార్మా కంపెనీలు సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించాలి: మంత్రి కోమటిరెడ్డి

మాదాపూర్‌: రాష్ట్రం నుంచి ప్రతి ఏటా రూ.50 వేల కోట్ల విలువైన మందులను ఎగుమతి చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలి పారు. తమది పారి శ్రామిక అనుకూల ప్రభుత్వమని, పారి శ్రామికవేత్తలకు మంత్రివర్గం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని, ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్యా రానివ్వబోమని అన్నా రు. ఓఆర్‌అర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి పరిశ్ర మను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. 

మాదా పూర్‌లోని హైటెక్స్‌లో మూడురోజుల పాటు కొనసాగే 73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ను శుక్రవారం మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నెముక లాంటిదని భట్టి పేర్కొన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్‌ మెడిసిన్‌ ఉత్పత్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణ గుర్తింపు సాధించిందన్నారు.

కరోనా కాలంలో ఫార్మాసిస్టులు అసమానమైన చురుకుదనం ప్రదర్శించి అవిశ్రాంతంగా శ్రమించారని అభినందించారు. రాష్ట్ర్‌రంలో కొత్త విద్యుత్‌ పాలసీని తీసుకురాబోతున్నట్టు భట్టి తెలిపారు. మిగులు విద్యుత్‌ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
    గ్రామీణ ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఫార్మా దిగ్గజాలకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కంపెనీలు తమ సామాజిక బాధ్యత (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో టిమ్స్, వరంగల్‌లో గవర్నమెంట్‌ సూపర్‌ మల్టీ స్పెషాలిటీ హస్పిటల్‌ రూ.8 వేల కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు.

 ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ బి.పార్థసారథిరెడ్డి,  భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, ఫార్మా కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ మొంటుకుమార్‌ పటేల్, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజీవ్‌ రఘువంశీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 8,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

అమీన్‌పూర్‌లో ఫార్మా హెల్త్‌కేర్‌ ఐటీ హబ్‌ – పల్సస్‌ గ్రూప్‌ ప్రకటన
సాక్షి, హైదరాబాద్‌:     సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఏఐ డ్రివెన్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పల్సన్‌ గ్రూప్‌ తెలిపింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌లో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ఫార్మా హబ్‌ ఏర్పాటుతో దాదాపు 10 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొంది. 

అమీన్‌పూర్‌లోని ఐటీ/ఐటీఈఎస్‌ జోన్‌లో అద్భుతమైన మౌలిక వసతులు, రవాణా సౌకరర్యాలు ఉండడం హబ్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ సహా 1,400కు పైగా సైన్స్, టెక్నాలజీ, మెడికల్‌ జర్నల్స్‌ను ప్రచురించే గొప్ప వారసత్వంతో పల్సస్‌ గ్రూప్‌ సమాజానికి గణనీయమైన సహకారం అందిస్తోందని పేర్కొంది.  

హెల్త్‌కేర్‌ ఐటీ హబ్‌ ప్రయోజనాలు ఇలా... 
⇒ రోగులకు మెరుగైన వైద్య సేవలు
⇒ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా మారుతుంది
⇒10 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన
⇒అనుబంధ పరిశ్రమలు, సేవల ద్వారా 40 వేల పరోక్ష ఉద్యోగాలు
⇒ స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలు.

Advertisement
 
Advertisement
Advertisement