ప్రైవసీ, ప్రీమియం సర్వీసు పేరుతోట్రావెల్స్ ఆపరేటర్ల ప్రాణాంతక చెలగాటం
ఓవైపు కిటికీ అద్దం,మరోవైపు గాజు డోర్
నిప్పంటుకుంటే తప్పించుకోవడం కనాకష్టం
ఇప్పటికే పలు బస్సు అగ్నిప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా గుర్తించని రవాణా శాఖ
గత అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో 19 నిండుప్రాణాలు బలయ్యాయి. సకాలంలో ప్రయాణికులు బస్సులో నుంచి తప్పించుకోలేక చనిపోయారు.
2013 అక్టోబర్ 30న మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఏసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై 45 మంది దహనమైన ఘటన తర్వాత కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రమాద ఘటన తేల్చింది.
కానీ, ఇప్పటికీ తీరు మారలేదని స్పష్టమవుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం, బస్సుల్లో లోపాలను పసిగట్టి చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వెరసి ఇప్పుడు ప్రైవసీ, ప్రీమియం సర్వీసు పేరుతో ప్రయాణికులను మరింత ప్రమాదంలోకి నెట్టేసే గ్లాస్ చాంబర్ ఫెసిలిటీ తెరమీదకు వచ్చింది.
సాక్షి, హైదరాబాద్ : అర్ధరాత్రి వరకు సెల్ఫోన్తో గడపడం సర్వసాధారణమైంది. ఇక ప్రయాణాల్లో ఇది మరింత ఎక్కువ. బస్సుల్లో సెల్ఫోన్ వాడకం పక్క సీటు ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం అన్నట్టుగా ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో స్లైడింగ్ డోర్ ఉండే గ్లాస్ చాంబర్స్ అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు లోపల పడుకుని చాంబర్ డోర్ మూసేసుకుంటే వీరితో పక్కవారికి, పక్క బెర్త్ వారితో వీరికి ఎలాంటి ‘ఆటంకం’ఉండదు.
ప్రమాదం జరిగితే తప్పించుకోవటం ఎలా...
ఏసీ బస్సులు అగ్నిప్రమాదానికి గురైతే బస్సుల్లో విపరీతంగా పొగ నిండి ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పి సజీవ దహనమవుతున్నారు. ఇప్పుడు బెర్తును గ్లాస్ చాంబర్గా మార్చటంతో ప్రమాదం జరిగినప్పుడు నిద్రలో ఉండే ప్రయాణికులు బెర్తులోంచి వేగంగా బయటకు రావటానికి ఈ గ్లాస్ డోర్లు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది.
ఈ గ్లాస్ చాంబర్ల ఏర్పాటు అటు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 119కు, ఇటు మోటారుæ వాహనాల నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇటీవల ప్రమాదాలకు గురైన కొన్ని బస్సుల్లో ఈ తరహా గ్లాస్ చాంబర్లు ఉండటాన్ని గుర్తించిన పలు రాష్ట్రాలు వాటి తొలగింపునకు ఆదేశాలు జారీ చేశాయి. లేకుంటే ఫిట్నెస్ సరి్టఫికెట్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించాయి. కానీ, తెలంగాణ రవాణా శాఖ నిద్రమత్తు వీడలేదు.
ఎన్ని సిఫారసులు వచ్చినా... డోంట్ కేర్
» పాలెం దుర్ఘటన తర్వాత నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ దర్యాప్తు చేయటంతోపాటు వోల్వోకంపెనీ ప్రతినిధులను కూడా పిలిపించి బస్సు తయారీలో మార్పులనుసూచించింది. ఆ మేరకు బస్సు తయారీ డిజైన్లో సంస్థ కొన్ని మార్పులు చేసినా, రవాణాశాఖ అధికారులు మాత్రంగుణపాఠం నేర్చుకోలేదు.
» గ్లాస్ చాంబర్ క్లోజ్డ్ గాఉండటం వల్ల చిన్న నిప్పురవ్వ వచ్చినా పొగ నేరుగా చాంబర్లోకి చేరి ప్రయాణికుడు క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.
» నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే, ప్రయాణికులు వెంటనే స్లైడింగ్ డోర్ను తెరవటంలో గందరగోళానికి గురవుతారు.
» దట్టమైన పొగ, చీకటి అలుముకొంటే, స్లైడింగ్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఎక్కడుందో కనిపించదు, అవి జామ్ అయ్యే పరిస్థితి రావచ్చు.
» గ్లాస్ చాంబర్ల కోసం వాడే రబ్బర్ బెల్టులు, ప్లాస్టిక్ స్లైడర్లు అగ్ని ప్రమాదం జరిగితే విషపూరిత పొగను విడుదల చేస్తాయి.
» కిటికీ అద్దం పగలగొట్టేందుకు ప్రతి బెర్త్ వద్ద హ్యామర్ (సుత్తి) ఉండాలి. ప్రమాద సమయంలో ఒకవైపు కిటికీ అద్దం పూర్తిగా క్లోజ్ చేసి, మరోవైపు గ్లాస్ డోర్ పెట్టడం వల్ల హ్యామర్తో పగలగొట్టే సమయం కూడా ప్రయాణికుడికి దొరకదు.
»ఒక స్లీపర్ బస్సుకు కనీసం 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు (1 డోర్, 2 రూఫ్ హాచెస్, విండోస్) ఉండాలి. ఈ గ్లాస్ చాంబర్ల నిర్మాణం వల్ల ప్రయాణికుడు ఆ ఎగ్జిట్ మార్గాల వరకు కూడా రాలేడు.
» ప్రస్తుతం అన్ని ఏసీ బస్సుల్లో పొగను గుర్తించే వ్యవస్థ, అల్లారాలు, ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్ తప్పనిసరి. అయితే చాంబర్లు క్లోజ్ చేయడం వల్ల ఇవి కూడా సకాలంలో స్పందించకపోవచ్చు.


