హైదరాబాద్: పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్టీల్ బ్రిడ్జ్ బోల్టులు పది రోజుల్లోనే ఊడి పడటం విస్మయం కలిగిస్తోంది. దక్షిణ భారత్లోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జ్గా ఖ్యాతి గాంచిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్బ్రిడ్జ్ను ఈనెల 3న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించిన విషయం విదితమే. మరుసటి రోజు నుండే ఈ బ్రిడ్జ్ను వినియోగంలోకి తీసుకువచ్చారు.
రెండు రోజులుగా బ్రిడ్జ్ పై నుంచి బోల్టులు ఊడిపతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం బ్రిడ్జ్ కింద నుంచి వెళుతున్న వాహనదారుడిపై బోల్టు ఊడిపడింది. దానిని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అయ్యింది. దాంతో సైదాబాద్ స్టీల్బ్రిడ్జ్ నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి పట్టుమని పది పదిహేను రోజులు కూడా కాకముందే స్టీల్బ్రిడ్జ్ పైనుంచి ఇలా బోల్టులు పడటమేంటని పలువురు ప్రశి్నస్తున్నారు. అసలు బ్రిడ్జ్ నిర్మాణం సమగ్రంగా పూర్తయిందా? లేకుంటే సీఎంతో ప్రారంభించాలని అధికారులు తొందరగా పూర్తి చేసి చేతులు దులుపుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోల్టులు కాకుండా ఏమైనా పెద్ద నిర్మాణ సామగ్రి వాహనదారులపై పడితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


