క్యాంపస్‌ కొలువులకు కేరాఫ్‌ వరంగల్‌ ఎన్‌ఐటీ | NIT Warangal is care of campus placements full details | Sakshi
Sakshi News home page

NIT Warangal: క్యాంపస్‌ కొలువులకు కేరాఫ్‌ వరంగల్‌ ఎన్‌ఐటీ

Jun 4 2025 7:54 PM | Updated on Jun 4 2025 8:02 PM

NIT Warangal is care of campus placements full details

ప్రతికూల పరిస్థితులున్నా సత్తా చాటుతున్న విద్యార్థులు

వారి కోసం పోటీ పడుతున్న ప్రపంచ కంపెనీలు

ఈ ఏడాది 1,508 మందిలో 1,201 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

ఓ విద్యార్థికి అత్యధికంగా రూ. 64.3 లక్షల వార్షిక ప్యాకేజీ

తొలిసారి పీహెచ్‌డీలో ఆరుగురికి  రూ. 9 లక్షల ప్యాకేజీ

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) వరంగల్‌ ప్లేస్‌మెంట్లకు కేరాఫ్‌గా మారింది. నిట్‌లోని సెంటర్‌ ఫర్‌ కెరీర్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (సీసీపీడీ) ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపస్‌ సెలెక్షన్‌లకు ప్రపంచ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 296 కంపెనీలు నిట్‌ క్యాంపస్‌ సెలక్షన్స్‌లో పోటీపడ్డాయి. క్యాంపస్‌ సెలక్షన్స్‌కు 1,508 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,201 మంది ఎంపికయ్యారు.

ఓ విద్యార్థికి అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 64.3 లక్షలు రాగా.. అత్యల్ప వార్షిక ప్యాకేజీ రూ.14.3 లక్షలుగా నమోదైంది. యూజీ, పీజీ విద్యార్థులతోపాటు తొలిసారి ఆరుగురు పీహెచ్‌డీ అభ్యర్థులు రూ. 9 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపిక కావడం విశేషం. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, డేటా అనాలసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ప్రోడక్ట్‌ అనాలసిస్, ప్రోడక్ట్‌ ఇంజనీర్, కన్సల్టెంట్, మేనేజ్‌మెంట్, గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ లాంటి పోస్టులకు విద్యార్థులు ఎంపికయ్యారు.

ఒడిదొడుకులున్నా ‘టాప్‌’లోనే..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొలువుల మార్కెట్‌ ఈసారి అంతంతమాత్రంగానే ఉన్నా నిట్‌ క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కొలువులకు ఎంపికైన 1,201 మందిలో 679 మంది యూజీ విద్యార్థులు, 516 మంది పీజీ, ఆరుగురు పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు. వారిలో బీటెక్‌ ఈసీఈ చేసిన సోమిల్‌ మాల్‌ధానీ ఏకంగా 64.3 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యాడు. 

గతేడాది మొత్తం 1,483 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌కు అర్హత పొందగా 1,128 మంది ఎంపికయ్యారు. బీటెక్‌లో 82 శాతం మంది, ఎంటెక్, ఇతర పీజీ కోర్సుల్లో 76 శాతం మంది విద్యార్థులకు కొలువులు లభించాయి. గతేడాది ఒక విద్యార్థి అత్యధికంగా రూ. 88 లక్షల వార్షిక వేతనానికి ఎంపికవగా 12 మంది రూ. 68 లక్షల చొప్పున వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. సగటు వార్షిక వేతనం రూ. 15.6 లక్షలుగా నమోదైంది.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తా..
మాది జైపూర్‌లోని మధ్యతరగతి కుటుంబం. నిట్‌లో అత్యుత్తమ విద్యాబోధనతోపాటు సీసీపీడీ గైడెన్స్‌లో బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి రూ. 64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యా. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసి మిత్రులకు ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.
– సోమిల్‌ మాల్‌ధానీ, రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీ పొందిన విద్యార్థి

విద్యార్థుల్లో ప్రేరణ నింపుతున్నాం..
మా క్యాంపస్‌ నుంచి గతేడాది 1,128 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవగా ఈసారి 1,201 మంది ఎంపికవడం అభినందనీయం. అత్యుత్తమ బోధనతోపాటు లక్ష్య సాధన దిశగా విద్యార్థులకు మేం ప్రేరణ కల్పిస్తున్నాం.
– బిద్యాధర్‌ సుబుదీ, నిట్‌ డైరెక్టర్‌

వర్క్‌షాప్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వల్లే..
విద్యార్థులను ఇంట‌ర్వ్యూలకు ప్రిపేర్‌ చేయడం, వర్క్‌షాప్‌లు, వారి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు పదునుపెట్టడం క్యాంపస్‌ సెలక్షన్స్‌లో విజయానికి కీలక భూమిక పోషించాయి.
– హరికృష్ణ, సీసీపీడీహెడ్, ఎన్‌ఐటీ, వరంగల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement