ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏకు చుక్కెదురు

NIA Special Court Rejects NIA Petition Over UAPA Case - Sakshi

నిందితులకు బెయిల్‌ రద్దు పిటిషన్‌ తిరస్కరణ 

సాక్షి, హైదరాబాద్‌: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు బెయిల్‌ రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన విజ్ఞప్తిని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఆదేశాలిచ్చింది. గత ఏడాది జర్నలిస్ట్‌ బండారి మద్దిలేటి, న్యాయవాదులు నలమాస కృష్ణ, మెంచు సందీప్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ యూఏపీఏ కింద అరెస్టు చేసింది. కాగా, ప్రత్యేక కోర్టు ఈ నిందితులకు గత సంవత్సరం ఆగస్టు 21, సెప్టెంబర్‌ 15, 28 తేదీల్లో వేర్వేరు తీర్పుల ప్రకారం బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఎన్‌ఐఏ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ఈ కేసును మళ్లీ విచారించాలని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు సూచించింది. ఇటీవల ప్రత్యేక కోర్టు, కేసును తిరిగి విచారించింది. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది వి.పట్టాభి, న్యాయవాదులు నందిగం కృష్ణారావు, వి.రఘునాథ్‌ వాదించారు. కాగా బెయిల్‌ రద్దు చేసేందుకు ఎలాంటి కారణాలు లేనందున గతంలో బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top