
మహేశ్కుమార్ , జీవన్సాయి
జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు
రాజస్తాన్ విద్యార్థి మహేశ్కుమార్ ఆలిండియా టాపర్...
ఏపీ టాపర్గా నిలిచిన 19వ ర్యాంకర్ కార్తీక్ రామ్కిరీటి
టాప్ 100లో తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి ఆరుగురికి చోటు
ఫలితాలు ప్రకటించిన ఎన్టీఏ.. మొత్తం 12,36,531 మంది అర్హత
తెలంగాణ నుంచి 41,584 మంది.. ఏపీ నుంచి 36,776 మంది అర్హులు
టాప్ టెన్లో ఒక్కరే బాలిక.. వచ్చే నెలలో కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్/అమరావతి: దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ ప్రవేశ, అర్హత పరీక్ష (నీట్–యూజీ)లో రాజస్తాన్కు చెందిన మహేశ్కుమార్ జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర టాపర్గా కాకర్ల జీవన్ సాయికుమార్ మెరిశాడు. అతడికి జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ టాపర్గా నేషనల్ 19వ ర్యాంకు సాధించిన కార్తీక్ రామ్కిరీటి నిలిచాడు.
నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. టాప్ వంద లోపు తెలంగాణ నుంచి 5 మంది, ఏపీ నుంచి ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిలో మొత్తంగా బాలుర కంటే బాలికలే అధికంగా ఉన్నప్పటికీ టాప్ 10 ర్యాంకుల్లో 5వ ర్యాంకు సాధించిన ఢిల్లీ విద్యార్థిని అవికా అగర్వాల్ ఒక్కరే బాలిక ఉండటం గమనార్హం.
ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ–2025 పరీక్షను ఎన్టీఏ మే 4న నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 22.76 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 22,09,318 మంది పరీక్ష రాశారు. వారిలో 12,36,531 మంది అర్హత సాధించారు. టాప్ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా జనరల్ కేటగిరీవారే. వచ్చే నెలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
తెలంగాణ రాష్ట్రం నుంచి 72,094 మంది నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 70,259 మంది పరీక్ష రాశారు. వీరిలో 41,584 మంది అర్హత సాధించారు. అంటే 59.2 శాతం మంది అర్హత సాధించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే తక్కువే. నీట్–యూజీ 2024లో 77,848 మంది పరీక్ష రాయగా, 47,356 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో కూడా 2024 కన్నా 2025లో పరీక్ష రాసిన వారు, అర్హత సాధించినవారు తక్కువగానే ఉండడం గమనార్హం.
తెలంగాణ నుంచి నేషనల్ టాప్ 100 ర్యాంకుల్లో కాకర్ల జీవన్ సాయికుమార్ (18), షణ్ముఖ నిశాంత్ అక్షింతల (37), మంగరి వరుణ్ (46), యండ్రపాటి షణ్ముఖ్ (48), బిదిష మజీ (95) ఉన్నారు. కాగా, జాతీయ స్థాయిలో టాప్ 20 మహిళా టాపర్లలో తెలంగాణ నుంచి బిదిష మజీ తోపాటు 108వ ర్యాంకు సాధించిన బ్రాహ్మణి రెండ్లకు స్థానం లభించింది.

ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) కేటగిరీలోని టాప్ 10లో 46వ ర్యాంకు సాధించిన మంగరి వరుణ్కు చోటు దక్కింది. టాప్–10 ఎస్సీ కేటగిరీలో 147 ర్యాంకు సాధించిన రెడ్డిమల్ల శ్రీశాంత్ ఉన్నాడు. టాప్ 10 ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 377 ర్యాంకు సాధించిన పుజారి హాసిని, 1,178 ర్యాంకు సాధించిన బానోత్ ధీరజ్ కుమార్ ఉన్నారు.
ఏపీ నుంచి 36,776 మంది అర్హత
నీట్ యూజీ–2025లో ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది అర్హత సాధించారు. టాప్–100లో ఆరు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఏపీ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసుకోగా, 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. 19వ ర్యాంకుతో దర్భా కార్తీక్ రామ్ కిరీటి రాష్ట్ర టాపర్గా నిలిచాడు. కొడవాటి మోహిత్ శ్రీరామ్ (56), దేశిన సూర్యచరణ్ (59), పొదిలపు అవినాష్ (64 ఓబీసీ), యర్రా సమీర్ కుమార్ (70 ఓబీసీ), తుమ్మూరి శివ మణిదీప్ (92 ఓబీసీ) 100 లోపు ర్యాంకులు సాధించారు.
వీరుగాక కారుమంచి విక్రాంత్ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో దాదాపు 56 వేలు, ప్రైవేటు కాలేజీల్లో 52 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఏపీలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6,500 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 15 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర కోటా కింద భర్తీ చేస్తారు.
686 మార్కులకు మొదటి ర్యాంకు
నీట్ యూజీ–2025 పరీక్ష మొత్తం 720 మార్కులకు నిర్వహించగా, 651 నుంచి 686 మధ్య మార్కులు వచ్చిన వారు 73 మంది ఉన్నారు. అంటే జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చిన రాజస్తాన్కు చెందిన మహేశ్ కుమార్కు 686 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మొత్తం అర్హత సాధించినవారిలో 7.2 లక్షల మంది బాలికలు ఉండగా, 5.14 లక్షల మంది బాలురు ఉన్నారు.
కార్డియాలజిస్ట్ లేదా స్కల్ సర్జన్ అవుతా
తొమ్మిదో తరగతి నుంచే న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే వాడిని. అదిప్పుడు నెరవేరుతోంది. న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం పీజీ కార్డియాలజీ లేదా స్కల్ సర్జన్ రెండింటిలో ఒకటి చేసి వైద్య సేవలందించడమే నా లక్ష్యం. మా నాన్న డాక్టర్ డీఎస్ అరుణ్కుమార్ ఈఎన్టీ సర్జన్. అమ్మ లత గృహిణి. – డి. కార్తీక్రామ్ కిరీటి, ఆలిండియా ఓపెన్ కేటగిరీ 19వ ర్యాంకు, రాజమహేంద్రవరం