పోలీసులపై దాడి.. ఆత్మరక్షణ కోసం బొంగుళూరు వద్ద గాల్లోకి కాల్పులు
చివరకు నిందితుడి కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు
నల్లగొండ/ఇబ్రహీంపట్నం రూరల్: తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగను నల్లగొండ జిల్లా పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల వరుసగా చోరీలు జరుగుతుండడంతో దొంగలను పట్టుకునేందుకు నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేందర్రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి.ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ బృందాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చోరీలకు పాల్పడుతున్నది ఏపీలోని భీమవరం జిల్లా నర్సాపురం మండలం స్టేషన్పేట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు ముఠా అని గుర్తించారు. నిందితుడు భూష్మి శ్రీకాంత్ మంగళవారం రాత్రి డీసీఎంలో నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నట్టు సమాచారం రావడంతో నల్లగొండ పోలీసులు హైదరాబాద్లోని బొంగుళూరు సమీపంలో ఔటర్ రింగ్రోడ్ (ఓఆర్ఆర్) వద్ద నిఘా పెట్టారు. డీసీఎం ఓఆర్ఆర్ వద్దకు రాగానే పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు.
డీసీఎం ఆగగానే భూష్మి శ్రీకాంత్ ఒక్కసారిగా కిందకు దూకి తన వద్ద ఉన్న ఇనుప రాడ్డుతో నల్లగొండ సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిపై దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా, నిందితుడు దాడిని కొనసాగించడంతో అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన నిందితుడిని వనస్థలిపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం అంజనీపురం గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ వేల్పుల అతేంద్ర అలియాస్ అత్తిలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుల్ హత్య కేసులోనూ నిందితుడు..
ప్రధాన నిందితుడు భూష్మి శ్రీకాంత్ గతంలో ఓ కానిస్టేబుల్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ తెలిపారు. అతడిపై ఇప్పటికే 30కి పైగా కేసులు ఉన్నాయని, జైలు నుంచి విడుదలైన తర్వాత మరో 40కి పైగా చోరీలకు పాల్పడినట్టు విచారణలో అంగీకరించాడన్నారు. నల్లగొండ జిల్లాలోనే ఎనిమిది కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. దొంగిలించిన సొత్తు, అతడికి సహకరించిన వారి వివరాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ వివరించారు.
ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేందర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పీఎన్డీ.ప్రసాద్, ఎస్ఐ విజయ్కుమార్, హెడ్కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా, ఫయాజ్, పోలీసు కానిస్టేబుళ్లు శివరాజ్, నరేశ్, గులాం దస్తగిరి, కమల్ కిషోర్, సాయి, జునైద్, ఆశ్రర్ను ఎస్పీ అభినందించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు.


