దిగుబడి రాలేదని వరి పంటకు నిప్పు
నిడమనూరు: సన్నాలు దిగుబడి రావడం లేదని ఓ రైతు వరి పొలాన్ని తగలబెట్టాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన రైతు కంచి శ్రీనివాస్ తనకున్న ఆరు ఎకరాల్లో యాసంగి సీజన్లో చింట్లు (సన్నాలు) రకం వరి సాగు చేశాడు. అందులో రెండున్నర ఎకరాల్లో 60 బస్తాల ధాన్యం, మరో ఎకరంన్నరలో మూడు బస్తాలు దిగుబడి మాత్రమే వచ్చింది.
ఎకరంన్నర భూమిలో పంటను వరి కోత మెషీన్ మూడు గంటలపాటు కోయగా.. మూడు బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో మిగిలిన రెండు ఎకరాల వరికి శనివారం ఆ రైతు నిప్పంటించాడు. యాసంగిలో దొడ్డు రకం సాగు వద్దని ప్రభుత్వం చెప్పడం వల్ల సన్నాలు సాగు చేస్తే దిగుబడి రాలేదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.