రూ. 50 లక్షల కోసం దారుణం
వివరాలను వెల్లడిస్తున్న నారాయణపేట డీఎస్పీ లింగయ్య
నారాయణపేట: ఇన్సూరెన్స్ చేయించినవారే..రూ.50 లక్షల జీవిత బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో పథకం ప్రకారం హత్య చేసి.. దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు బోడి రాజు (44)కు మక్తల్ పట్టణానికి చెందిన ఆనంపల్లి భాస్కర్ దూరపు బంధువు. మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన అల్లెం నాగరాజు ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కమీషన్ ఒప్పందం చేసుకొని అందరితో బీమా చేయిస్తుంటాడు. అదే తరహాలో తనకు పరిచయం ఉన్న ఆనంపల్లి భాస్కర్ సహాయంతో బోడి రాజుతో రూ.50 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు.
రాజు వద్ద డబ్బు లేకున్నా.. తర్వాత ఇవ్వమని చెప్పి నిందితుడు నాగరాజే తొలిఏడాది పాలసీ డబ్బులు కట్టాడు. ఫోన్నంబర్ పాలసీదారుడు రాజుది కాకుండా నాగరాజు తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అయితే బీమా డబ్బు సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనంపల్లి భాస్కర్తోపాటు గుడిగండ్ల గ్రామానికి చెందిన సిరిగిరి భాను ప్రకాశ్తో కలిసి పథకం వేశారు. అందులో భాగంగా జూన్ 3న సాయంత్రం రాజును తమ వెంట తీసుకెళ్లారు. ఆయనకు బాగా మద్యం తాగించిన అనంతరం సామన్పల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు.
ప్రమాదంగా నమ్మించే యత్నం..
దాడి అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బోడి రాజును భాను ప్రకాశ్కు చెందిన కారులో హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, దండు చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమా దం జరిగిందని, చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం ఇచ్చారు.
జూన్ 4న కుటుంబ సభ్యులు మక్తల్ పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమాద మరణంగా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన మక్తల్ పోలీసులు అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు. కారు డ్రైవర్ సిరిగిరి భానుప్రకాశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. దండు చౌరస్తా వద్ద ఎ లాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని తేలింది.
అనంతరం నిందితులను లోతుగా విచారించగా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పన్నిన హత్య కుట్ర వెలుగులోకి వచి్చంది. పోలీసుల విచార ణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లెం నాగరాజు, సిరి గిరి భాను ప్రకాశ్, ఆనంపల్లి భాస్కర్లను అరెస్ట్ చేశారు.


