దేవికా నం.1.. మోహన్‌ నం.2 | Mohan Naik and Devikarani arrested by ACB officials on corruption | Sakshi
Sakshi News home page

దేవికా నం.1.. మోహన్‌ నం.2

Jun 11 2026 3:59 AM | Updated on Jun 11 2026 3:59 AM

Mohan Naik and Devikarani arrested by ACB officials on corruption

దేవికారాణి తర్వాతి స్థానంలో మోహన్‌నాయక్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) జరుప్ల మోహన్‌ నాయక్‌ స్థిరచరాస్తుల డాక్యుమెంట్‌ విలువ రూ.17.94 కోట్లుగా తేలింది. దీంతో ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ‘అవినీతి అనకొండ’గా మోహన్‌ నాయక్‌ రికార్డులకెక్కారు. ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మాజీ డైరెక్టర్‌ దేవికారాణి ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు.  

థర్డ్‌ శివబాలకృష్ణ..ఫోర్త్‌ కిషన్‌ 
ఈఎస్‌ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019లో అరెస్టు అయిన దేవికారాణి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.25,70,84,461గా తేలగా.. మోహన్‌ నాయక్‌ రూ.17,94,62,617తో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్‌ విలువ పది నుంచి ఇరవై రెట్లు అధికంగా ఉంటుంది. 2024 జనవరిలో చిక్కిన హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ రూ.13.3 కోట్లతో మూడో స్థానంలో, మహబూబ్‌నగర్‌ మాజీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కిషన్‌ రూ.12.72 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.  

‘లంచాల’కోసం ఏడాదికి 30 లక్షలు 
ఎవరైనా బాధితులు ఓ అధికారి లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే..రహస్య కెమెరాలు, వీడియో రికార్డింగ్‌ పరికరాలను బాధితుడికి అమర్చి అధికారి వద్దకు పంపి రికార్డు చేయిస్తారు. డిమాండ్‌ చేసిన మొత్తంలో కొంత ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఇస్తానంటూ చెప్పిస్తారు. ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తం అందుకుంటున్న అధికారిని అప్పటికే మాటు వేసి ఉండే ఏసీబీ బృందాలు పట్టుకుంటాయి. డబ్బును సీజ్‌ చేసి కోర్టుకు సమరి్పస్తారు. ఆ మొత్తం కేసు తేలేవరకు కోర్టు అ«దీనంలోనే ఉంటుంది. అయితే ఈలోగానే నిర్ణీత సమయంలో డబ్బును ఫిర్యాదుదారుడికి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.30 లక్షల చొప్పున ఏసీబీకి కేటాయిస్తుంది.  

వాస్తవానికి ‘రెడ్‌’కాదు ‘పింక్‌’ 
లంచగొండుల్ని ఏసీబీ ట్రాప్‌ చేస్తే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని అంటారు. అయితే వాస్తవానికి ఇది ‘పింక్‌’హ్యాండెడ్‌గా పట్టుకోవడం. ఫిర్యాదుదారుడు తీసుకువచ్చిన మొత్తానికి ఏసీబీ అధికారులు ఫినాఫ్తలీన్‌ అనే రసాయన పొడిని పూస్తారు. లంచం తీసుకునే అధికారి లేదా ఆయన సూచించిన వ్యక్తి ఆ నోట్ల కట్టలు కచ్చితంగా చేత్తో పట్టుకుని ఉండాలి. అలా ముట్టుకున్నప్పుడు ఈ రసాయనం అంటుకుంటుంది. 

తర్వాత దాడి చేసి పట్టుకునే ఏసీబీ అధికారులు సదరు మొత్తాన్ని స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆ అధికారి చేతుల్ని సోడియం బైకార్పొనేట్‌ ద్రావణంలో ముంచేలా చేస్తారు. అప్పుడు ఆ ద్రావణం పింక్‌ రంగులోకి మారుతుంది. (ఈ ప్రక్రియ రెడ్‌హ్యాండెడ్‌గా వాడుకలోకి వచ్చింది) తద్వారా లంచం తీసుకున్నట్టుగా నిర్ధారిస్తారు. దీన్ని వీడియో రికార్డింగ్‌ చేశాక అధికారులు న్యాయస్థానానికి సమర్పిస్తారు. 

గణనీయంగా పెరిగిన కేసులు.. 
ఏసీబీ అధికారులు మొత్తం 4 రకాలైన ఆపరేషన్లు చేపడతారు. లంచం తీసుకునే వాళ్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం (ట్రాప్‌), ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండటం (అసెట్స్‌) వ్యవహారాలే మనకు ఎక్కువగా తెలుసు. వీటిని రిజిస్టర్డ్‌ కేస్‌ ట్రాప్‌ (ఆర్సీటీ), రిజిస్టర్డ్‌ కేస్‌ అసెట్స్‌ (ఆర్సీఏ) అంటారు. అలాగే చెక్‌పోస్టులు, కార్యాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు (ఎస్సీగా పిలిచే సర్‌ప్రైజ్‌ చెక్స్‌) ద్వారా గుర్తించే అవినీతిపై రిజిస్టర్డ్‌ కేస్‌ అదర్స్‌ (ఆర్సీఓ) నమోదు చేస్తారు. 

కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది (మంగళవారం వరకు) ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇలావుండగా మోహన్‌ నాయక్‌ను అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించారు. అయితే తదుపరి విచారణ కోసం మోహన్‌ నాయక్‌ కస్టడీ కోరుతూ అధికారులు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement