శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆ శ్యామలదేవి ఎవరో కూడా తెలియదు. నా భూమి పక్క భూమి ఆమెది అని తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ... నన్ను ఇప్పటివరకూ కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. (మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు)
కాగా భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఈ నెల 6వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది.