కబ్జా అంటే కాలు, చెయ్యి నరికేది గ్యారెంటీ! | TDP Leader Kurava Shivappa Viral Threat Over Kurnool School Land Row Sparks Outrage, More Details Inside | Sakshi
Sakshi News home page

కబ్జా అంటే కాలు, చెయ్యి నరికేది గ్యారెంటీ!

Jul 8 2026 1:48 PM | Updated on Jul 8 2026 1:59 PM

Kurava Shivappa Video Warning Land Encroachment Adoni

కర్నూలు: కబ్జా అంటే కాలు, చెయ్యి నరికేది గ్యారెంటీ.. ఈ అల్టిమేటం ఇచ్చింది సాక్షాత్తూ టీడీపీ ఆదోని మండల అధ్యక్షుడు కురవ శివప్ప. సోషల్‌ మీడియా ద్వారా చేసిన ఈ హెచ్చరిక చర్చనీయాంశమవుతోంది. గత సోమవారం పాఠశాల స్థలం కబ్జాపై విద్యార్థులు నిరసన గళం వినిపించారు. 

గత జూన్‌ 27న ‘పచ్చ’నోట్లకు రిజిస్ట్రేషన్ శీర్షికన ‘సాక్షి’ టీడీపీ నేత భూకబ్జాను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విచారణ పేరిట అధికారులు కాలయాపన చేస్తుండటంతో పాఠశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు స్కూలుకు తాళం వేశారు. ధర్నా కార్యక్రమం నిర్వహించి పాఠశాలను కబ్జాదారుడి నుంచి కాపాడాలని నినాదాలు చేశారు. దీంతో దొడ్డనగేరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 4.50 ఎకరాల గ్రామ కంఠం భూమి వివాదం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. 

మంగళవారం టీడీపీ నాయకుడు కురవ శివప్ప సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఎవరైనా తాను కబ్జా చేశానంటే కాలు, చెయ్యి నరికేది గ్యారెంటీ ’ అంటూ వ్యాఖ్యానించిన వీడియో వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా కురవ శివప్ప భార్య విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను కలుసుకుని ఉద్యమానికి దూరంగా ఉండాలని ఒత్తిడి తీసుకొచ్చారని, భయపెట్టే విధంగా మాట్లాడారని విద్యార్థులు, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement