జరిమానా వేశారని బండినే తగలబెట్టాడు

Man Set His Bike On Fire Police Fined Him For Not Having Insurance In Sangareddy District - Sakshi

జోగిపేట (ఆందోల్‌): ద్విచక్ర వాహనానికి ఇన్సూరెన్స్‌ లేదని పోలీసులు ఫైన్‌ వేసినందుకు తన బైకునే తగలబెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం అన్నా సాగర్‌ కట్టపై జరిగింది. జోగిపేట పోలీసులు అన్నాసాగర్‌ కట్టపై వాహనాల తనిఖీ చేపట్టారు. వాహ నాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి జరిమానా వేస్తున్నారు.

జోగిపేట వైపు వెళ్తున్న బైక్‌ను ఆపి డాక్యుమెంట్లు తనిఖీ చేసి ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో పోలీసులు రూ.1,100 ఫైన్‌ వేశారు. రశీదు తీసుకున్న వాహనదారుడు అక్కడే 2, 3 సార్లు చక్కర్లు కొట్టి కట్టపై కల్వర్టు వద్ద బైక్‌ (స్లె్పండర్‌)ను నిలిపి పెట్రోల్‌ పైపును బయటకు తీసి వాహనానికి నిప్పంటించాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం వాహనదారుడిని పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అతన్ని చౌటకూరు మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన పాండుగా గుర్తించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top