ఎయిర్‌పోర్టుల్లో ‘బిచ్చగాడు’.. ఓ యువకుడి నకిలీ యాచన! | Man fake begging targeted airports | Sakshi
Sakshi News home page

ఇదే బాగుందనుకుని ‘బిచ్చగాడి’అవతారం

May 22 2023 3:54 AM | Updated on May 22 2023 8:43 AM

Man fake begging targeted airports - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు కూడళ్లు, ప్రార్థనా స్థలా­లు, ఫంక్షన్‌ హాళ్లు తదితర చోట్ల యాచకులను చూస్తూనే ఉంటాం. వృద్ధాప్యం వల్లో లేదా శారీరక వైకల్యం వల్లో యాచించే వారు కొందరైతే దీన్నే దందాగా మార్చుకొని జీవించే వారు ఇంకొందరు కనిపిస్తుంటారు.

కానీ ఇలా రోజంతా అడుక్కున్నా ఎవరికైనా లభించేది చిల్లరే... అందుకే సులువుగా నోట్ల కట్టలు సంపాదించేందుకు ఓ యువకుడు ఏకంగా ఎయిర్‌పోర్టులనే లక్ష్యంగా చేసుకొని ‘బిచ్చగాడి’అవతారం ఎత్తాడు! శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా ఎనిమిది విమానాశ్రయాల్లో నాలుగేళ్లుగా ‘యాచిస్తూ’విదేశీయులు, ప్రవాస భారతీయులు సహా అనేక మంది నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అక్కడి సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

పర్సు పోవడంతో ఎదురైన అనుభవంతో..
చెన్నైకు చెందిన విఘ్నేష్‌ బీటెక్‌ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్‌ పర్సు పోగొట్టుకున్నాడు.

విమాన టికెట్‌ తన ఫోన్‌లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్... బెంగళూరు ఎయిర్‌పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టిపెట్టాడు.  

ముందస్తు షెడ్యూల్‌తో ముష్టి కోసం..
విమానాశ్రయాలనే టార్గెట్‌గా చేసుకొని ప్రయా­ణికులకు వివిధ పేర్లతో టోకరా వేసి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం విఘ్నేష్‌ నిర్ణీత సమయానికి ముందే తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్‌ విమాన టికెట్లు బుక్‌ చేసుకొనేవాడు. ఖరీదైన క్యాజువల్స్‌ ధరించి, చేతిలో లగేజ్‌ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్‌ షెడ్యూల్‌ టైమ్‌కు దాదాపు 4–5 గంటల ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు.

ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్‌ (సైలెంట్‌ మోడ్‌లో ఉంచి) మాట్లాడినట్లు నటించేవాడు. తన తండ్రి తీవ్ర అనారోగ్యంపాలైనట్లు ఫోన్లో కుటుంబ సభ్యులు చెప్పారని... వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్‌ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు.

ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా ఇదే పంథాలో దండుకొనేవాడు. ఇలా విఘ్నేష్‌ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. నిర్ణీత మొత్తం సంపాదించాకే చెన్నైలోని ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు. 

ఇప్పటివరకు ఫిర్యాదులులేకపోవడంతో..
ఈ పంథాలో విఘ్నేష్‌ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకున్నాడు. విఘ్నేష్‌ మోసగించిన వారిలో అత్యధికులు విదేశీయులే కావడంతో వారికి ఇది మోసమని తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగానే 2021 నుంచి విఘ్నేష్‌ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అయితే ఈ నెల 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్‌ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నే‹Ùను పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్‌ హైదరాబాద్‌లో సాగించిన ‘భిక్షాటన’గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement